ఆ ఖర్చులు చెల్లించాల్సిందే: బీసీసీఐకి రూ. 11 కోట్లు చెల్లించిన పీసీబీ

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ. ఐసీసీ వివాదాల పరిష్కార కమిటీలో నష్టపరిహారం కేసు ఓడిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)... భారత క్రికెట్ బోర్డుకి దాదాపు రూ. 10.97 కోట్లు నష్ట పరిహారం చెల్లించింది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి సోమవారం తెలిపారు.
2015 నుంచి 2023 వరకు తమతో ఆరు ద్వైపాక్షిక సిరీస్లు ఆడతామని కుదుర్చుకున్న ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘించినందుకు నష్టపరిహారం కోరుతూ కొన్ని నెలల క్రితం పీసీబీ.. ఐసీసీ వివాదాల పరిష్కార కమిటీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పాక్ ఓడిపోయింది.

పాక్లో పర్యటించేందుకు
పాక్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదని బీసీసీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. ఒప్పందం కూడా న్యాయపరంగా చెల్లదని భారత్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత బీసీసీఐ.. పీసీబీ తప్పుడు కేసు వేసిందని, కాబట్టి న్యాయపరమైన ఖర్చులు ఆ బోర్డు నుంచే వసూలు చేయాలని ఐసీసీని కోరింది.

న్యాయపరమైన ఖర్చులు చెల్లించాల్సిందే
ఐసీసీ కూడా పీసీబీని న్యాయపరమైన ఖర్చులు చెల్లించాల్సిందేనని పేర్కొంది. "బీసీసీఐ చేతిలో ఓడిన నష్టపరిహారం కేసులో మేం 2.2 మిలియన్ డాలర్లు కోల్పోయాం. చివరకు ఐసీసీ భారత్కు చెల్లించాల్సిన మొత్తాన్ని 1.6 మిలియన్ డాలర్లు(సుమారు రూ.11 కోట్లు)గా ఖరారు చేసింది" అని మణి పేర్కొన్నారు.

ఎంవోయూ ప్రకారం ఆరు ద్వైపాక్షిక సిరీస్లు
భారత్-పాక్ జట్ల మధ్య కుదర్చుకున్న ఎంవోయూ ప్రకారం 2015-23 వరకు ఇండో-పాక్ మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్లు జరగాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘించింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా తమకు 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 490 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ ఐసీసీ వివాద పరిష్కార కమిటీలో కేసు వేసింది.

పీసీబీనే బీసీసీఐకి ఎదురు డబ్బులు
అయితే, భారత ప్రభుత్వం అనుమతించక పోవడంతో ఆడలేకపోయామని బీసీసీఐ తెలిపింది. ఒప్పందానికి చట్టబద్ధత కూడా లేదని వాదించింది. విచారణ అనంతరం కేసును కొట్టివేసిన కమిటీ.. బీసీసీఐకి న్యాయపరమైన ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. దీంతో చివరకు పీసీబీనే బీసీసీఐకి ఎదురు డబ్బులు ఇచ్చుకోవాల్సి పరిస్థితి తలెత్తింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications