కరాచీ: పాకిస్థాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ గత ఏడాది కాలంగా వెన్ను గాయంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ గాయం కారణంగానే 2019 వన్డే ప్రపంచకప్లో హసన్ అలీ చెత్త ప్రదర్శన చేసాడు. కొన్ని నెలల విశ్రాంతి అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడాడు. అయితే వెన్ను గాయం టోర్నీలో మధ్యలోనే తిరగబెట్టడడంతో కొన్ని మ్యాచులు ఆడలేకపోయాడు.
మరో టిక్టాక్.. కొడుకుతో కలిసి గబ్బర్ హల్చల్!!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైద్య సిబ్బంది ఉన్నపళంగా హసన్ అలీ గాయాన్ని పరిశీలించి.. అత్యవసర సర్జరీ కోసం అతడ్ని విదేశాలకి పంపించాలని నిర్ణయించారు. ఈ మేరకు పీసీబీ మెడికల్ బోర్డు హెడ్ డాక్టర్ సలీమ్ ఓ రిపోర్ట్ని తయారుచేసి పాక్ క్రికెట్ బోర్డు అధికారులకి సమర్పించాడు. ఆపై ఉన్నపళంగా హసన్ అలీని విదేశాలకి పంపే ఏర్పాట్లు చేసారు పీసీబీ అధికారులు. ఏర్పాట్లు చేస్తుండగానే కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరింది. దీంతో అన్ని దేశాలు పర్యాటక వీసాల్ని రద్దు చేశాయి.
హసన్ అలీ వెన్ను గాయానికి లండన్లో సర్జరీ చేయించి.. అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించాలని అప్పట్లో డిమాండ్స్ వినిపించాయి. ఆ సమయంలో మౌనంగా ఉండిపోయిన పీసీబీ.. అలీకి వెన్నుగాయం తిరగబెట్టడంతో గత మార్చి నెలలో లండన్లో సర్జరీ చేయించాలని నిర్ణయించింది. అయితే లండన్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాకి పంపాలని పీసీబీ భావించింది. కానీ ఈ రెండు దేశాల్లోనూ పర్యాటక వీసాలపై నిషేధం విధించాయి.
ప్రస్తుతం అన్ని దేశాల్లో పర్యాటక వీసాలపై నిషేధం ఉండటంతో పీసీబీ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎక్కడ సర్జరీ చేయించాలని అయోమయంలో పడింది. ఎందుకంటే.. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ ఉంది కాబట్టి. టోర్నీ జరిగే సమయానికి హసన్ అలీ ఫిట్నెస్ సాధించాలని పీసీబీ ఆశిస్తోంది. అయితే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో సర్జరీ జరిగే సూచనలు ఉన్నాయి. అలీ పాక్ తరఫున 9 టెస్టులు, 53 వన్డేలు, 30 టీ20లు ఆడాడు.