పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రజా మరోసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై కడుపు మంట వెళ్లగక్కాడు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో అత్యధిక భాగం భారత్ నుంచే వస్తుందన్న రమీజ్ రజా.. అందుకే బీసీసీఐ విషయంలో ఐసీసీ పక్షపాతం చూపిస్తుందని ఆరోపణలు చేశాడు.
ఆసియా కప్ 2023 వివాదం విషయంలోనే రమీజ్ రజా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీ వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరుగుతుంది. అయితే పాక్లో తమ జట్టు ఆడటం జరగదని, ఏదైనా తటస్థ వేదికకు ఈ టోర్నీని మార్చాలని అనుకుంటున్నామని బీసీసీఐ సెక్రటరీ జై షా కొంతకాలం క్రితం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో కూడా సెక్రటరీ జనరల్గా జై షానే ఉండటం గమనార్హం. దీంతో ఈ విషయంలో ఐసీసీ చర్యలు తీసుకోవాలని పీసీబీ పట్టుబడుతోంది. అయితే ఆసియా క్రికెట్ మండలి నిర్ణయాల్లో తల దూర్చకూడదని అనుకున్న ఐసీసీ తటస్థ వైఖరి అవలంబిస్తోంది.
దీనిపై రమీజ్ రజా మండిపడ్డాడు. 'ఐసీసీకి వచ్చే ఆదాయం మొత్తం భారత్ నుంచే వస్తుంది. అందుకే ఐసీసీ ఈ విషయంలో ముందుకు రావడం లేదు. ఇలా పక్షపాత ధోరణి అవలంబిస్తోంది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డులు, క్రికెట్ ప్రపంచం అంతా ఒక జట్టు కట్టి బలంగా నిలబడితేనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. లేదంటే ఇది ఇలాగే కొనసాగి ఏదో ఒక బోర్డుకు ఐసీసీ వంతపాడుతూనే ఉంటుంది' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్తాన్ మ్యాచులు మరిన్ని జరగాలని, ఈ విషయంలో రాజకీయాల జోక్యం ఉండకూడదని రమీజ్ రజా అన్నాడు. అభిమానులు కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచులు చూడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.