ఇప్పుడు కుదరదు..
'పీసీబీ అధ్యక్ష పదవి చాలా పెద్ద సవాలుతో కూడుకున్నది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాకు ఈ కఠినమైన ఉద్యోగాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు'అని చెప్పగా.. పాకిస్థాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఎప్పుడు జరుగుతుందని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి సమాధానమిస్తూ..'ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అది అసాధ్యం. ఎందుకంటే రాజకీయాలపై ఇప్పుడు క్రీడాటోర్నీ నిర్వహణ ఆధారపడి ఉంది. అయితే భారత్తో ద్వైపాక్షిక సిరీస్ కోసం మాకు అంత తొందరేమి లేదు. ప్రస్తుతం పాక్ దేశవాళీ క్రికెట్ను అభివృద్ధిగా దిశగా తీసుకెళ్లడం మా ముందున్న కర్తవ్యం" అని రమీజ్రాజా స్పష్టం చేశాడు.
ఏకగ్రీవంగా ఎన్నిక
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికలో రమీజ్ రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గతంలో పీసీబీ అధ్యక్షుడిగా వ్యవహరించిన హెసన్ మణి పదవీకాలం పూర్తవ్వడంతో కొత్త చైర్మన్గా రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే తాత్కాలిక కోచ్లుగా నియమితులైన సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్లూ కూడా ఈ మీటింగ్కు హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే రమీజ్ రాజా.. తన మార్క్ చూపించాడు. పాకిస్థాన్ హెడ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, సౌతాఫ్రికా మాజీ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ను బౌలింగ్ కోచ్ నియమిస్తున్నట్లు ప్రకటించారు.
255 మ్యాచ్లు..
క్రికెటర్గా..రమీజ్ రాజా.. పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టుకు 18వ కెప్టెన్గా.. వన్డే టీమ్కు 12వ సారథిగా వ్యవహరించాడు. క్రికెట్ కెరీర్ 1984 నుంచి 1997 మధ్యలో 255 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రమీజ్ రాజా.. 8,674 పరుగులను నమోదు చేశాడు. గతంలో పాక్ బోర్డుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కామెంటేటర్గా రమీజ్ రాజాకు మంచి గుర్తింపు ఉంది. మొన్నటి వరకు అతను తన యూట్యూబ్ చానెల్లో భారత క్రికెట్కు సంబంధించిన అనేక విషయాలను విశ్లేషించాడు.