ఇంకో 5 - 7 పరుగులు చేయాల్సింది
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఈ మ్యాచ్ ఎంతో కష్టమైనదని, విజయం సాధించడానికి తాము చాలా కష్టపడ్డామని అయినా ఫలితం దక్కలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ బ్యాటింగ్లో తమ జట్టు ఇంకో 5 నుంచి 7 పరుగులు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే 9 వికెట్లు కోల్పోయినప్పటికీ 189 పరుగులు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అనంతరం లక్ష్య చేధనలో ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ ధాటిగా ఆడినప్పటికీ, తర్వాత తాము పుంజుకున్నామని మయాంగ్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు.
ఓడియన్ స్మిత్కు అండగా ఉంటాం
తమ జట్టు బౌలర్లు అర్ష్దీప్, రబాడ అత్యుత్తమ బౌలింగ్ చేశారని మయాంగ్ అగర్వాల్ కొనియాడాడు. జట్టును విజయం అంచులకు తీసుకెళ్లారని అన్నాడు. అయితే చివరి ఓవర్లో ఇరు జట్లకు గెలవడానికి సమానంగా అవకాశాలు ఉన్నాయని మయాంక్ చెప్పాడు. గుజరాత్ గెలిచిన చివరి ఓవర్ వేసిన ఓడియన్ స్మిత్కు తాము అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చాడు. ఓడియన్ స్మిత్కు 100 శాతం మద్దతిస్తామని తెలిపాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే అయినప్పటికీ తిరిగి పుంజుకుంటామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
అతనికి హ్యాట్సాఫ్
ఇక ఆటలో గెలుపోటములు సహజమేనని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తానెప్పుడు న్యూట్రల్గా ఉంటానని, దానికి గెలుపోటములతో సంబంధం లేదని తెలిపాడు. చివర్లో తమ జట్టు బ్యాటర్ రాహుల్ తెవాటియా అద్భుతంగా ఆడాడని కొనియాడిన పాండ్యా.. అతనికి హ్యాట్సాఫ్ చెప్పాడు. ఉత్కంఠతో సాగుతున్న మ్యాచ్లో అలా బ్యాటింగ్ చేయడం గొప్ప విషయమని ప్రశంసించాడు. ఇక నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ పంజాబ్ గెలవాల్సింది అని, వాళ్లు ఓటమి పాలవడం తనకు బాధగా ఉందని హార్దిక్ పాండ్యా చెప్పాడు.
అలసిపోతున్నా..
అలాగే తమ జట్టు బ్యాటర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఆడిన తీరుపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు. శుభ్గిల్తో కలిసి సాయి సుదర్శన్ నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యం అమూల్యమైనదని, ఆ భాగస్వామ్యమే తమను చివరి వరకు మ్యాచ్లో నిలబెట్టిందని వెల్లడించాడు. ఇక తాను వ్యక్తిగత ఆట పరంగా మ్యాచ్ మ్యాచ్కు మెరుగవుతున్నానని, అయితే 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసే క్రమంలో అలసి పోతున్నట్టు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.