|
నాలుగేసిన శార్దూల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సర్ఫరాజ్ ఖాన్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు తీయగా.. రబడా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 44) ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీలో శార్దూల్ (4/36) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు. అన్రిచ్ నోర్జ్ ఓ వికెట్ పడగొట్టాడు.
|
పేకమేడలా...
160 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ధాటిగా ఆడిన ఓపెనర్ జానీ బెయిర్ స్టో(28)ను అన్రిచ్ నోర్జ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స(4), శిఖర్ ధావన్(19)లను శార్దూల్ ఠాకూర్ బంతి వ్యవధిలో ఔట్ చేసి వెనక్కిపంపాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. ఆ మరసటి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్(0) సిల్వర్ డక్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
|
ఆఖరి టెన్షన్ రేగినా..
ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ను కుల్దీప్ యాదవ్ స్టంప్ ఔట్ చేశాడు. ఆ కొద్దిసేపటికే హర్ప్రీత్ బ్రార్(1)ను కుల్దీప్ యాదవ్, రిషిధావన్(4)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ చాహర్తో కలిసి జితేశ్ శర్మ పోరాడాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని శార్దూల్ ఠాకూర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన రబడా కూడా సిక్సర్ బాది ఔటయ్యాడు. చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా.. 19వ ఓవర్లోనోర్జ్ మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో చివరి ఓవర్లో 26 పరుగులు అవసరవ్వగా.. శార్దూల్ కట్టడిగా బౌలింగ్ చేసి 8 పరుగులే ఇవ్వడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.