ముంబై: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్, కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు పాట్ కమిన్స్.. ఈ ఏడాదిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్ను భారత్లో నిర్వహించకపోవడమే మంచిదన్నాడు. భారతీయులకు ఏది మంచిదో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో మెగా టోర్నీని యూఏఈకి తరలించడం మంచిదని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ ఏడాది చివరలో జరగబోయే టీ20 ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోల్కతా బౌలర్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి.. సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ పాజిటివ్గా తేలారు. దీంతో బయో బుడగ బలహీనంగా మారింది. ఉన్నపళంగా సమావేశమైన బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి.. ఐపీఎల్ 2021ను వాయిదా వేసింది. దీంతో టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు ఏడాది చివర్లో కరోనా మూడో దశ విజృంభించే ప్రమాదం ఉన్నందున టీ10 ప్రపంచకప్పైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
IPL 2021: 'గుండె బద్దలైంది.. త్వరలోనే మళ్లీ వస్తాను! అప్పటి వరకు ఈ ఫొటోను చూసుకుంటా!
'ది ఏజ్' వార్తాపత్రికతో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ... 'ఒకవేళ ఐసీసీ టీ20 ప్రపంచకప్ను నిర్వహించడం.. భారత వనరులను దెబ్బతీసినా లేదా సురక్షితమైంది కాదని తెలిసినా దాన్ని యూఏఈకి తరలించడం మంచిదని నేను అనుకుంటున్నా. ఆ మెగా ఈవెంట్కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. భారతీయులకు ఏది మంచిదనే విషయంపై క్రికెట్ వర్గాలు ప్రభుత్వంతో చర్చలు జరపడం ముఖ్యం' అని అన్నాడు. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ అద్భుతంగా జరిగింది. అక్కడ బాగా నిర్వహించారు. కానీ చాలా మంది దాన్ని భారత్లోనే నిర్వహించాలని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అందరి అభిప్రాయం తెలుసుకొని ఇక్కడే కొనసాగించారు' అని అన్నాడు.
ఐపీఎల్ను వాయిదా వేయడంతో విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇంటికి చేరుకున్నారు. అయితే కొంతమంది ఆటగాళ్లకు స్వదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు. ఆసీస్ దేశ ప్రభుత్వం భారత్ విమాన రాకపోకలను నిషేదించడమే అందుకు కారణం. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో మాల్దీవులు మీదుగా స్వదేశానికి వెళ్లనున్నారు. మాల్దీవులలో 14 రోజులు క్వారంటైన్లో ఉన్న అనంతరం ఆసీస్ బయలుదేరనున్నారు.