త్రివర్ణపతాకాలను తప్ప మరే జెండాలను
రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ పోలీసులు స్టేడియంలోకి త్రివర్ణపతాకాలను తప్ప మరే ఇతర పార్టీ జెండాలను అనుమతించలేదట. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు కానీ, టోపీలను గానీ ఎలాంటివి ధరించి స్టేడియంలోకి అనుమతించలేదట. ఈ విషయంలో పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్
స్టేడియానికి వచ్చే వీక్షకుల భద్రతా విషయాల గురించి లక్నో సీనియర్ పోలీస్ సుపరిటెండెంట్ కళానిధి నైథనీ మాట్లాడారు. సోమవారం నాడు ఇకానా స్టేడియం పేరును భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా మారుస్తూ యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ స్టేడియం యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హయాంలో నిర్మించడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమాజ్వాదీ శ్రేణులు స్వగతించ లేదు.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం
'ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం అసంతృప్తితో ఎస్పీ పార్టీ కార్యకర్తలు ఏమైనా చేయొచ్చని అనుమానంతో జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ క్రమంలో సుమారు 1500మంది పార్టీ శ్రేణులు భాజపా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎరుపు టోపీలు, నలుపు జెండాలతో మ్యాచ్కు హాజరయ్యేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఒక్క త్రివర్ణపతాకానికి సంబంధించిన జెండాలు తప్ప.. మరెలాంటి జెండాలు, టోపీలు, బ్యానర్లను స్టేడియంలోకి అనుమతించలేదు' అని ఆయన పేర్కొన్నారు.
భద్రత దృష్ట్యా స్టేడియం వద్ద 3200 పోలీసులు
పూర్తిస్థాయి భద్రత దృష్ట్యా స్టేడియం వద్ద సుమారు 3200మంది పోలీసులను మోహరించినట్లు తెలిసింది. ఇంతకుముందు యూపీలో పలుమార్లు ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవం నాడు, ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్, నోయిడాలో ఢిల్లీ మెట్రో విస్తరణ సమయంలోనూ ఇలాంటి ఆందోళనలే జరిగాయి. అలాంటివి చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.