న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అలాంటి సారథి టీమ్ మీటింగ్ కేవలం రెండు నిమిషాల్లోనే ముగిస్తాడని, ఆటగాళ్లపై ఎప్పుడూ పూర్తి క్లారిటీతో ఉంటాడని ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తెలిపాడు.
2008 ఐపీఎల్ సీజన్ ఫైనల్కు ముందు కేవలం రెండు నిమిషాల్లోనే టీమ్ మీటింగ్ను కెప్టెన్ ధోనీ ముగించాడని గుర్తు చేసుకున్న ఈ సీనియర్ వికెట్ కీపర్.. గతంతో పోలిస్తే ఇప్పుడు టీమ్ ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకొచ్చాడు. గత కొన్ని సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న పార్థివ్.. స్టార్ స్పోర్ట్స్ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఐపీఎల్ 2008 ఫైనల్ మ్యాచ్ చూస్తూ నాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
'2008 ఐపీఎల్ ఫైనల్కు ముందు టీమ్ మీటింగ్ను ధోనీ కేవలం రెండు నిమిషాల్లోనే ముగించేశాడు. నా అంచనా ప్రకారం 2019 ఐపీఎల్ ఫైనల్లోనూ ధోనీ అంతకంటే తక్కువ సమయంలోనే మీటింగ్ను పూర్తి చేసి ఉంటాడు. ఆటగాళ్ల విషయంలో ధోనీ ఎప్పుడూ ఓ క్లారిటీతో ఉంటాడు. ఎవరి నుంచి ఎలాంటి ప్రదర్శనను రాబట్టాలో అతనికి బాగా తెలుసు. మునుపటితో పోలిస్తే ఐపీఎల్ ప్రణాళికలు, వ్యూహాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. గతంలో చివరి 5 ఓవర్లలో 30 నుంచి 36 పరుగులు రాబట్టాలని ప్లాన్ వేసుకునేవాళ్లం. కానీ.. ఇప్పుడు చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 50 నుంచి 60 పరుగులు రాబట్టేస్తున్నారు'అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఇక అంతకు ముందు ధోనీ తర్వాత భారత జట్టుకు సరైన కీపర్ దొరకలేదని ఈ సీనియర్ వికెట్ కీపర్ అభిప్రాయపడ్డాడు.'ధోనీ తర్వాత ఇప్పటి వరకూ టీమిండియాకు సరైన వికెట్ కీపర్ దొరికాడని నేను అనుకోవట్లేదు. ఇండియా -ఎ జట్టుకి కేఎస్ భరత్.. భారత్ టెస్టు జట్టుకి సాహా ఉన్నాడు. మరి.. టీ20, వన్డేలకు ఎవరు? నిలకడగా పరుగులు సాధిస్తేనే భారత్ జట్టులో కీపర్గా కొనసాగగలరు. భారత్ జట్టులో కీపర్ ఆల్రౌండర్గా ఉండాలి. ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ తరహాలో పరుగులు రాబడుతూ కీపింగ్ చేయగలిగినప్పుడే జట్టులో కొనసాగుతారు'అని తెలిపాడు.
ఇక మహేంద్రసింగ్ ధోనీ కంటే ముందే భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పార్థీవ్ పటేల్.. ధోనీ రాకతో క్రమంగా అంతర్జాతీయ క్రికెట్కి దూరమయ్యాడు. కానీ.. ఐపీఎల్లో మాత్రం అతను రెగ్యులర్గా కొనసాగుతున్నాడు. అయితే.. ఏ జట్టులోనూ సుదీర్ఘకాలం ఆడటం లేదు. ఇప్పటి వరకూ 12 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. ఆరు టీమ్స్కి అతను మారాడు.
ఆ ఘోర పరాజయంతో వారిని చంపేయాలనేంత కసిని పెంచుకున్నా: శ్రీశాంత్