స్కౌట్స్ గ్రూప్లో:
2015, 2017 సీజన్లలో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో పార్థీవ్ పటేల్ సభ్యుడు. పార్థివ్ ముంబై తరఫున మూడేళ్లు ఆడాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్, వికెట్ కీపర్గా జట్టుకు సేవలందించాడు. సుదీర్ఘకాలం రంజీ క్రికెట్ ఆడిన పార్థీవ్కు దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ల గురించి బాగా తెలుసు. ఆ ఉద్దేశంతోనే ముంబై స్కౌట్స్ గ్రూప్లో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో పార్థీవ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమైనప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. పార్థివ్ భారత జట్టు తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
మేం ఏం చేయాలనుకుంటున్నామో పార్థివ్కు తెలుసు:
'దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో పార్థివ్ పటేల్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఐపీఎల్లో వేగంగా పెరుగుతున్న పోటీని అతడు అర్థం చేసుకోగలడు' అని ముంబై ఇండియన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. మళ్లీ తమ బృందంలో చేరినందుకు ఆ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ అభినందనలు తెలియజేశారు. 'ముంబై ఇండియన్స్కు ఆడుతున్నప్పటి నుంచి మాకు పార్థివ్ తెలివితేటలు తెలుసు. అతడికున్న క్రికెట్ విజ్ఞానంతో మా ప్రతిభాన్వేషణ వ్యవస్థకు తోడ్పడగలడని విశ్వాసం ఉంది. మా ఆలోచనా విధానం పార్థివ్ అర్థం చేసుకుంటాడు. ముంబైలో మేం ఏం చేయాలనుకుంటున్నామో అతడికి తెలుసు' అని అంబానీ పేర్కొన్నారు.
మరుపురాని గుర్తులు:
తనకు మరో అవకాశం ఇచ్చిన ముంబై యాజమాన్యానికి పార్థివ్ పటేల్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘ముంబై ఇండియన్స్కు ఆడుతూ నా క్రికెట్ను ఎంతో ఆస్వాదించా. మూడు సార్లు ట్రోఫీలు అందుకోవడం నాకు మరుపురాని గుర్తులు. ఇప్పుడు నా జీవితంలో సరికొత్త అధ్యాయానికి సమయం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబైకి ధన్యవాదాలు' అని అన్నాడు. 2002లో ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇంగ్లడ్తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి పార్థీవ్ అడుగుపెట్టాడు. 17 ఏళ్ల 153 రోజుల వయసులో క్రికెట్లోకి అడుగుపెట్టి.. అత్యంత పిన్న వయస్కుడైన వికెట్ కీపర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు.