దుబాయ్: పాకిస్థాన్ లెగ్స్పిన్నర్ యాసిర్ షా ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో సంచలన ప్రదర్శన చేస్తూ.. పాక్ను ఒంటిచేత్తో గెలిపించేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్తో మూడో టెస్టు తొలిరోజు ఆటలో 3 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. దీంతో కివీస్ టీ బ్రేక్ సమయానికి 60 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు.
కేన్(70నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించే దిశగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బీజే వాట్లింగ్(15) క్రీజులో ఉన్నాడు. ఇప్పటి వరకు 33 టెస్టులాడిన షా 63 ఇన్నింగ్స్ల్లో 198 వికెట్లు తీశాడు. ఇంకో 2 వికెట్లు పడగొడితే టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్ను అందుకోనున్నాడు.
సోమవారం ఆఖరి సెషన్లో సత్తాచాటాలని షా ఉత్సాహంగా ఉన్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ 36 టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయి చేరుకున్నాడు. 1936లో టెస్టు క్రికెట్లో గ్రిమ్మెట్ రికార్డు నెలకొల్పాడు. ఇదే సిరీస్లో అంతకుముందు జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఒక మ్యాచ్లో అబుదాబి వేదికగా గెలుపొందగా పాకిస్తాన్ దుబాయ్ వేదికగా 16 పరుగుల తేడాతో గెలుపొంది 1-1తో స్కోరును సమం చేసింది.
రెండు ఇన్నింగ్సులు కలిపి షా తీసిన 14వికెట్లు పాక్ను గెలిచేలా చేశాయి. అయితే న్యూజిలాండ్ జట్టులోనూ ఇలాంటి బౌలర్లు లేకపోలేదు. కివీస్ తొలి టెస్టులో నాలుగు పరుగులతో గెలుపొందడానికి కారణం నీల్ వాగ్నర్, ఇష్ సోధీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ, ఆఫ్ స్పిన్నర్ విల్ సోమర్విలేలే.