కరాచీ: ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యటన కోసం మొత్తం 25 మందిని ఇంగ్లండ్ పంపించేందుకు కసరత్తులు చేస్తున్నాం అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో.. సిరీస్ ఆడేందుకు ఇక్కడికి పాక్ జట్టుని పంపుతారా అని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పీసీబీ అడగ్గా.. తాము సిద్ధమని పాక్ బోర్డు ప్రకటించింది.
నా కెరీర్లో ఆ రెండే చింతించాల్సిన సందర్భాలు: సచిన్
ఇంగ్లండ్ టూర్లో పాక్ మూడు టెస్టులు, మూడు టీ20 సిరీస్లు ఆడాల్సి ఉంది. పీసీబీ రెండు ఫార్మాట్లకి వేర్వేరుగా జట్లని ప్రకటించింది. మొత్తంగా 25 మందిని అక్కడికి పంపించేందుకు పీసీబీ సిద్దమైంది. ఆగస్టులో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. కానీ జులైలోనే ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ అడుగుపెట్టనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో పాక్ నుంచి అక్కడికి వెళ్లిన క్రికెటర్లు, కోచ్లు, సహాయ సిబ్బంది కనీసం 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో నెల రోజుల ముందే పాక్ బృందం ఇంగ్లీష్ గడ్డకు చేరుకోనుంది.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఆటగాళ్లపై ఎలాంటి బలవంతం ఉండదని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ చెబుతున్నాడు. ఇప్పటికే ఈ టూర్కు సంబంధించి ఈసీబీతో చర్చించామని, టూర్కు సంబంధించి కార్యాచరణ సిద్ధమైందన్నాడు. ఈ టూర్ గురించి ఆటగాళ్లపై ఒత్తిడేమీ లేదని, అభ్యంతరమున్నవాళ్లు తప్పుకోవచ్చని తెలిపాడు. యూకేలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 2,48,293కి చేరుకోగా.. 35వేల మంది చనిపోయారు.
స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ పాకిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్గా ఇటీవలే ఎంపికయ్యాడు. ఇప్పటికే టీ20 కెప్టెన్గా ఉన్న బాబర్.. ఇప్పడు వన్డే కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు. మాజీ కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ స్థానంలో బాబర్ వన్డే సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఇక టెస్ట్ కెప్టెన్గా అజర్ అలీ కొనసాగనున్నాడు. 2020-21 సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను పీసీబీ ప్రకటించింది. 18 మంది ప్లేయర్ల కాంట్రాక్టులో కొత్తగా ఇద్దరికి చోటు దక్కింది. నసీమ్ షా, ఇఫ్తికార్ అహ్మద్లు రాగా.. హసన్ అలీ, ఆమిర్, వహాబ్ రియాజ్లకు కాంట్రాక్టు దక్కలేదు.