
హైదరాబాద్: జింబాబ్వే పర్యటనలో పాకిస్థాన్ మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. పాక్ పేసర్ ఫహీమ్ అష్రఫ్ 5/22 తో చెలరేగడంతో బుధవారం ఆతిథ్య జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ను మరో రెండు మ్యాచ్లుండగానే 3-0తో సొంతం చేసుకుంది.
జింబాబ్వే నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.5 ఓవర్లలోనే పాక్ ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఆరంభం నుంచే తడబాటుకు లోనైంది. అరంగేట్ర క్రికెటర్ మసవావురే (1)ని ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఔట్ చేశాడు. దీంతో జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మసకద్జా(10)తో మరో ఓపెనర్ చిబాబా (16) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాలని చూశాడు. అయితే, పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో వీరిద్దరినీ పెవిలియన్కు చేర్చారు. వీరిద్దరూ ఔటయ్యాక జింబాబ్వే వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆపై ఏదశలోనూ జింబాబ్వే కోలుకోలేదు.
దీంతో జింబాబ్వే 67 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఇనాముల్ హక్ వికెట్ కోల్పోయింది. స్వల్ప లక్ష్యం కావడంతో ఎలాంటి ఓత్తిడికి లోనుకాకుండా మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (43 నాటౌట్), బాబర్ అజమ్ (19 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు.
వన్డేల్లో పాక్ 40కి పైగా ఓవర్లుండగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన ఫకీమ్ అష్రఫ్ (5/22)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరిస్ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే పాకిస్థాన్ కైవసం చేసుకుంది.