భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరం రోజురోజుకూ మరింత పెద్దది అవుతోంది. తాజాగా ఈ గొడవలో పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (పీబీసీసీ) కూడా చేరింది. టీ20 వరల్డ్ కప్లో ఆడాల్సిన తమ ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు ఇవ్వలేదని పీబీసీసీ ఆరోపించింది. డిసెంబరు 5 నుంచి 17 వరకు భారత్ వేదికగా అంధుల టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో కప్పు గెలిచే ఫేవరెట్లలో తమ జట్టు ఒకటన్న పీబీసీసీ.. రాజకీయాలను క్రీడలకు దూరంగా పెట్టాలన్న ఇంగితం కూడా భారత్కు లేదని మండి పడింది.
మంగళవారం నాడు సౌతాఫ్రికాతో పాకిస్తాన్ జట్టు ఆడాల్సి ఉంది. అయితే వీసా సమస్యల కారణంగా పాక్ జట్టు భారత్ చేరుకోలేదని తెలిసింది. దీనిలో సమస్య ఏమీ లేదని, రాజకీయ కారణాలు చూపించిన భారత్ తమకు వీసాలు మంజూరు చేయలేదని పీబీసీసీ పేర్కొంది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. క్రీడలను, రాజకీయాలను వేరు వేరుగా చూడాలని, ముఖ్యంగా దివ్యాంగుల క్రీడల విషయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సమంజసం కాదని పీబీసీసీ అసహనం వ్యక్తం చేసింది. తాము ఈ విషయాన్ని తేలికగా తీసుకోబోమని, కచ్చితంగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
భవిష్యత్తులో ఇలాంటి కీలకమైన టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని భారత్కు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తామని స్పష్టం చేసింది. భారత్లోని బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో తమకు సాయం చేయాలని చూసిందని, ప్రభుత్వ పెద్దలతో వీసాల గురించి మాట్లాడిందని వివరించింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం తమ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వడానికి ససేమిరా అనడం దురదృష్టకరమని చెప్పింది. ఈ టోర్నీలో భారత్, నేపాల్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ పాల్గొంటున్నాయి.