ఐదుసార్లు పాజిటివ్:
ఇప్పటికే పాకిస్తాన్ జట్టు మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ టూర్ కోసం పీసీబీ 29 మంది ఆటగాళ్లతో బృందాన్ని ఎంపిక చేసింది. ఇంగ్లండ్ వెళ్లే ముందు కరోనా వైరస్ పరీక్షలు చేయగా.. అందులో 10 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అందులో హారిస్ రౌఫ్ కూడా ఉన్నాడు. పాజిటివ్ వచ్చిన వారు రెండు బ్యాచ్లుగా ఇంగ్లండ్ టూర్కి వెళ్లగా.. హారిస్ మాత్రం ఇంకా పాక్లోనే ఉన్నాడు. హారిస్కు ఐదుసార్లు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అతడు ఇంగ్లండ్ వెళ్లలేకపోయాడు. చివరికి అతనికి నెగటివ్ అని వచ్చింది.
రెండుసార్లు నెగెటివ్ వస్తేనే:
ఇప్పటికే హరీస్ రౌఫ్కు ఒకసారి కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయినప్పటికీ.. కోవిడ్-19 నిబంధనల ప్రకారం వరుసగా రెండుసార్లు నెగెటివ్ వస్తేనే అతడు పూర్తిగా కోలుకున్నట్లు లెక్క. అప్పుడు మాత్రమే అతడు ఇంగ్లండ్లోని జట్టుతో కలిసే అవకాశం ఉంటుంది. తాజాగా నెగెటివ్ రాగా.. మరోసారి రావాల్సి ఉంది. 26 ఏళ్ల హారీస్కు కోవిడ్-19 లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఇంగ్లీష్ గడ్డపై హరీస్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఈసీబీ మరలా పరీక్షలు చేస్తుంది. అప్ప్పుడు కూడా సానుకూల ఫలితం వస్తేనే అతడు జట్టుతో కలుస్తాడు.
ఆగస్టు 5న తొలి టెస్ట్:
ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొత్తాన్ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఈసీబీ నిర్వహించబోతోంది. బయో సెక్యూర్ రూల్స్ ప్రకారం నెల రోజుల ముందే అక్కడికి పాక్ టీమ్ని రప్పించిన ఈసీబీ.. 14 రోజులు క్వారంటైన్లో ఉంచింది. ఇటీవలే క్వారంటైన్ సమయం ముగిసింది. ఇక సిరీస్కి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకి కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ ఉన్న వారిని మ్యాచ్ ఆడడానికి అనుమతిస్తారు. జులై 13న పాక్ టీమ్ డెర్బీషైర్కు వెళ్లింది.
మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే:
ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. సిరీస్ మొత్తం మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే జరగనున్నాయి. మొదటి టెస్టు మాంచెస్టర్లో జరుగుతుంది. రెండో టెస్టు (ఆగస్టు 13-17), మూడో టెస్టు (ఆగస్టు 21-25)కు సౌతాంప్టన్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత రెండు జట్లు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి. తొలి మ్యాచ్ ఆగస్టు 28న జరుగుతుంది. టీ20లు అన్నీ సౌతాంప్టన్లో జరుగుతాయి.