హైదరాబాద్: పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుకు అదనంగా ఎలాంటి డబ్బు చెల్లించలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ తెలిపారు. 2009లో శ్రీలంక ఆటగాళ్లపై పాకిస్థాన్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ దేశంలో ఓ జట్టు ఇప్పటివరకు పర్యటించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ పదేళ్లలో ఆ దేశంలో పర్యటించేందుకు ఏ జట్టూ సాహసించ లేదు.
గతేడాది వెస్టిండిస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. అయితే, ఈ పర్యటనకు విండిస్ ప్రధాన ఆటగాళ్లు వెళ్లలేదు. తాజాగా 3 వన్డేలు, 3 టీ20ల సిరిస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పాకిస్థాన్ పర్యటనకు పంపింది. భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు దూరంగా ఉన్నారు.
'చిల్ మూడ్'లో కేఎల్ రాహుల్: సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్న నెటిజన్లు
సీనియర్ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో.. శ్రీలంక బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని అక్కడికి పంపించింది. పాక్ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా కరాచీ వేదికగా సెప్టెంబర్ 27న శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తొలి వన్డేతో తలపడనుంది.
జనవరి 2009 తర్వాత కరాచీ వేదికగా జరుగుతున్న మొట్టమొదటి వన్డే ఇదే కావడం విశేషం. 2009లో ఉగ్రదాడి అనంతరం ఇప్పటివరకూ పాకిస్థాన్ తమ సిరీస్లన్నీ యూఏఈ వేదికగా నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు తమ దేశంలో భద్రత మరింత మెరుగైందని.. ఇకపై జరిగే స్వదేశీ సిరిస్లన్నీ తమ దేశంలోనే జరుగుతాయని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ తెలిపారు.
ఈ సందర్భంగా వసీం ఖాన్ మాట్లాడుతూ "ఇకపై పాకిస్థాన్లోనే మా మ్యాచ్లను నిర్వహించాలని నిర్ణయించాం. తమ దేశంలో భద్రత మరింత మెరుగైందని.. ఇకపై జరిగే స్వదేశీ సిరిస్లన్నీ మా దేశంలోనే జరుగుతాయి. యూఏఈలో మ్యాచ్లు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని" అని ఆయన తెలిపారు.
List of most admired man in India: ప్రధాని మోడీ తర్వాత ధోనియే
"ప్రస్తుతం పాకిస్థాన్ చాలా సురక్షితంగా ఉంది. భద్రత మరింతగా మెరుగైంది. ఇది ఇప్పుడు మా హౌం గ్రౌండ్. శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ ముఖ్యం. మేము వారికి అదనంగా డబ్బు చెల్లించడం లేదని మీకు తెలియజేస్తున్నా. వారు 13 రోజులు ఇక్కడకు వస్తున్నారు. ఇతర దేశాలను మా దేశానికి వస్తే.. వాళ్లకు ఆతిథ్యం ఇచ్చేంగా మేము ఎదిగాము" అని వసీం ఖాన్ తెలిపాడు.
పదేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ద్వైపాక్షిక సిరిస్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు స్టేడియాలకు రావాలని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ పిలుపునిచ్చాడు. సర్ఫరాజ్ అహ్మాద్ మాట్లాడుతూ "శుక్రవారం చరిత్ర సృష్టించబడుతుంది. ద్వైపాక్షిక సిరిస్లో భాగంగా జనవరి 2009 తర్వాత కరాచీలో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ చరిత్రలో క్రికెట్ అభిమానులు భాగస్వామ్యం కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఫలితంగా నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ సిరీస్ జరిగిందని ఆ తర్వాతి తరానికి తెలియజేయవచ్చు" అని ఐసీసీతో అన్నాడు.