భారత్ బెదిరింపులు:
'పాకిస్థాన్ పర్యటనను తిరస్కరించకపోతే ఐపీఎల్ నుండి బహిష్కరిస్తాం అని శ్రీలంక ఆటగాళ్లను భారత్ బెదిరించిందని స్పోర్ట్స్ వ్యాఖ్యాతలు సమాచారం ఇచ్చారు. ఇది సరైన పద్దతి కాదు. నిజంగా భారత్ది చౌకైన వ్యూహం. ఇది కచ్చితంగా ఖండించవలసిన విషయం. ఇది భారత క్రీడా అధికారుల చీప్ రాజకీయాలు' అని ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశారు.
10 మంది ఆటగాళ్ల నిరాకరణ:
సెప్టెంబర్ నెలలో లంక జట్టు పాక్లో వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటించాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ టూర్ షెడ్యూల్ చేయబడింది. ఈ పర్యటన నేపథ్యంలో లంక బోర్డు సోమవారం ఆటగాళ్లతో సమావేశం అయింది. లంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగ.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్కు వెళ్లేందుకు నిరాకరించారు. వీరితో పాటు 10 మంది లంక ఆటగాళ్లు పాక్ పర్యటనను నిరాకరించారు.
షెడ్యూల్ ప్రకారం సిరీస్;
'భద్రతా కారణాల రీత్యా లంక ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడటానికి ఒప్పుకోలేదు' అని లంక బోర్డు పీసీబీకి తెలిపింది. 'శ్రీలంక బోర్డు ఎదుర్కొంటున్న పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం. బోర్డు తమ ఆటగాళ్ళను ఈ పర్యటన కోసం రమ్మని బలవంతం చేయలేరని మాకు తెలుసు. ఏదేమైనా షెడ్యూల్ ప్రకారం సిరీస్ కొనసాగుతుందని' పీసీబీ పేర్కొంది. పాక్ ఆటగాళ్లే లంక వెళ్లే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
యూఏఈలోనే మ్యాచ్లు:
2009లో శ్రీలంక జట్టు పాక్లో పర్యటించినప్పుడు వారిపై దాడులు జరిగాయి. ఆ సమయంలో బస్సులో ఉన్న లంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత పాక్లో ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగలేదు. మళ్లీ లంక జట్టుతో పాక్లో క్రికెట్ను పునరుద్ధరించాలని పీసీబీ భావించింది. కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. పాకిస్థాన్ గత 10 ఏళ్ల కాలంలో తమ సొంత మ్యాచ్లను యూఏఈలోనే ఆడుతోన్న విషయం తెలిసిందే.