
హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్ను తప్పించడంపై అతడి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సర్ఫరాజ్ అహ్మద్ నేపథ్యంలోని పాకిస్థాన్ జట్టు ఈ మధ్య కాలంలో పేలవ ప్రదర్శన చేయడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు అతడిని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
టెస్టుల్లో కెప్టెన్గా అజహర్ అలీని నియమించగా... టీ20లకు యువ బ్యాట్స్మెన్ బాబర్ అజాంను నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో జట్టు మొత్తం విఫలమైతే సర్ఫరాజ్ను బలి పశువును చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ తప్పించి అజహర్ అలీకి టెస్టు పగ్గాలు అప్పచెప్పడం ఏంటని మండిపడుతున్నారు.
ఒక నెటిజన్ గత ఐదు మ్యాచ్ల్లో అజహర్ అలీ పేలవ ప్రదర్శన కనిపించలేదా? అని పీసీబీని నిలదీయగా.... మరొక నెటిజన్ "ఇదొక అవినీతి నిర్ణయం.. ఇది పంజాబ్ క్రికెట్ బోర్డు" అని ట్వీట్ చేశాడు. ఇంకొకరు "అలీని ఎందుకు కెప్టెన్గా చేశారు.. బాబర్ అజామ్నే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా చేయాల్సింది" అని ట్వీట్ చేశాడు.
"శ్రీలంకతో సిరీస్లో అత్యధిక పరుగులు చేసినందుకు సర్ఫరాజ్కు ఇది కానుక" అని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ప్టెన్సీ నుంచి సర్ఫరాజ్ అహ్మద్ను తప్పించడంపై పాకిస్థాన్ ఛైర్మన్ ఇషాన్ మణి మాట్లాడుతూ "సర్ఫరాజ్ అహ్మద్ మనకు తెలిసిన ధైర్యమైన క్రికెటర్, పోరాట యోధుడు. అతడు మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు" అని అన్నాడు.
ఏప్రిల్ 2016న సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు టీ20 కెప్టెన్గా నియమింపబడ్డాడు. ఆ తర్వాత 2017లో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2017లో వెస్టిండిస్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించడంతో ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు అతడినే కెప్టెన్గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టుకు 13 టెస్టులు, 48 వన్డేలు, 34 టీ20లకు కెప్టెన్గా వ్యవహారించాడు. సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత సర్ఫరాజ్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో ర్యాంకింగ్స్లో మరింతగా దిగజారింది.