పాక్ను ఐసీసీ మరచినట్లుంది..
ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు జట్లపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘పాకిస్థాన్ జట్టు టీ20 మ్యాచులు ఆడుతుందని ఐసీసీ మర్చిపోయినట్లు ఉంది'అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తమ జట్టులో కూడా ప్రతిభావంతులైన టీ20, వన్డే, టెస్ట్ ప్లేయర్స్ ఉన్నారని, కానీ వారెవరికీ ఐసీసీ జట్టులో చోటు లభించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్ను కూడా ఐసీసీ ఎంపిక చేయలేదు. ఒక్కరంటే ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ కూడా ఆ జట్టులో లేడు'అని అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
|
అది బెస్ట్ ఐపీఎల్ టీమ్..
ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు టీ20 టీమ్ను అత్యుత్తమ ఐపీఎల్ టీమ్ అనడం ఉత్తమమని పాక్ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. ఐసీసీ భారత్ చేతిలో కీలు బొమ్మని, వారు చెప్పినట్లే చేస్తారని, అందుకే పాక్ ఆటగాళ్లకు చోటు దక్కలేదని కామెంట్ చేస్తున్నారు. టీ20ల్లో వరుసగా 11 సిరీస్లు నెగ్గిన పాక్ నుంచి ఒక్క ఆటగాడికి అవకాశం దక్కకపోవడం విచిత్రమని, ఇది పూర్తిగా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్, వన్డేల్లో రాణించికపోయినా.. పాక్ ఈ దశాబ్దపు టీమ్లో అదరగొట్టిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
బాబర్ ఆజామ్, సనా మిర్..
దశాబ్దపు టీ20 జట్టులో బాబర్ ఆజామ్కు అవకాశం దక్కాల్సిందని పాక్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అతను ఈ దశాబ్దపు టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణించాడని పరుగుల స్టాట్స్తో సహా ట్వీట్ చేస్తున్నారు. మహిళల క్రికెట్లో సనా మిర్ బాగా రాణించిందని, ఆమెకు అవకాశం దక్కాల్సిందన్నాడు. ఇక టెస్ట్ టీమ్లో యూనిస్ ఖాన్ రాణించాడని అతనికి చోటు దక్కాల్సిందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ దశాబ్దపు టీమ్ల్లో పాక్కు అన్యాయం జరిగిందని, భారత్కు తలొగ్గి ఐసీసీ.. పాక్ ఆటగాళ్లకు అన్యాయం చేసిందని ట్వీట్ చేస్తున్నారు.
భారత్ ఆటగాళ్లదే హవా..
ఐసీసీ దశాబ్దపు వన్డే, టీ20 జట్లకు ఎంఎస్ ధోనీ, టెస్ట్ టీమ్కు విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. అయితే ఈ మూడు దశాబ్దపు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. భారత్ నుంచి వన్డే టీమ్లో ముగ్గురు, టీ20ల్లో నలుగురు, టెస్ట్ల్లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. తొలిసారి ఓటింగ్ పద్దతిని ప్రవేశపెట్టడంతో వరల్డ్ వైడ్గా 25 లక్షల మంది అభిమానులు ఇందులో పాల్గొన్నారు. మరోవైపు ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్లో హైదరాబాద్ స్టార్ మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి ఉండగా.. హర్మన్ ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్కు టీ20లో చోటు లభించింది.