|
నువ్వు సాధించిన వాటికి గర్వపడుతున్నాం:
షోయబ్ మాలిక్ రిటైర్మెంట్పై అతని భార్య, భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపించింది. 'ప్రతీ కథకి ఒక ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతీ ముగింపునకు కొత్త ప్రారంభం ఎదురుచూస్తుంది. 20 సంవత్సరాలు నీ దేశం తరఫున ఎంతో నిబద్ధతతో ఆడావు. నువ్వు సాధించిన వాటికి నేను, ఇజాన్ ఎంతో గర్వపడుతున్నాం. ఇక్కడ మరికొన్ని వేల టీ20 పరుగులు ఉన్నాయి' అని సానియా ట్వీట్ చేసింది.
|
రిటైర్ అవుతున్నా:
రిటైర్మెంట్పై ట్విట్టర్ వేదికగా షోయబ్ మాలిక్ స్పందిస్తూ... 'ఈ రోజు అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నా. నాతో ఆడిన ఆటగాళ్లకు, శిక్షణ ఇచ్చిన కోచ్లకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా, స్పాన్సరర్స్ కు ధన్యవాదాలు. ముఖ్యంగా నా అభిమానులకు కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్' అని మాలిక్ రాసుకొచ్చారు.
8 పరుగులే:
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాడుగా ఇంతకాలం షోయబ్ మాలిక్ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై అతడి సేవలు జట్టుకు ఉపయోగపడుతాయని పాక్ యాజమాన్యం అతన్ని సెలెక్ట్ చేసింది. అయితే అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ప్రపంచకప్ టోర్నీలో ఘోరంగా విఫలమై జట్టులోనే చోటు కోల్పోయాడు. ఈ ప్రపంచకప్లో మూడు మ్యాచ్లే ఆడిన మాలిక్.. 8, 0, 0 పరుగులు చేశాడు. దీంతో అతన్ని పక్కనపెట్టేశారు. ఒక మ్యాచ్లో అయితే వికెట్లను బ్యాట్తో కొట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక టీమిండియాపై డకౌట్ అయి మరిన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు.
7,534 పరుగులు:
1999లో వెస్టిండీస్పై తొలి వన్డే ఆడిన మాలిక్.. చివరి వన్డే టీమిండియాపై ఆడాడు. 20 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో పాక్కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు చేసాడు. అత్యధిక స్కోర్ 143. ఇక 39.19 సగటుతో 158 వికెట్లు కూడా పడగొట్టాడు. 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. మాలిక్, సానియాలకు ఓ కుమారుడు ఉన్నాడు.