
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ అసిఫ్ అలీ ఇంట విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటా అసిఫ్ అలీ రెండేళ్ల కుమార్తె నూర్ ఫాతిమా మరణించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న అసిఫ్ అలీ హుటాహుటిన ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు పయనమయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భంగా అసిఫ్ అలీ తన ట్విట్టర్లో "నా కుమార్తె స్టేజి ఫోర్ క్యాన్సర్తో పోరాడుతుంది. ట్రీట్మెంట్ కోసం అమెరికాకి తీసుకొచ్చాం. కేవలం ఒక్క గంటలోనే తన కుమార్తెకి వీసా మంజూరు చేసిన ఇస్లామాబాద్ యుఎస్ ఎంబసీ, లాహోర్లోని యుఎస్ ఎంబీకి ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు మైక్, ఎలిజిబెత్, తన్వీర్ భాయ్" అంటూ ట్వీట్ చేశాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్లో అసిఫ్ అలీ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు యాజమాన్యం ట్విట్టర్ ద్వారా అసిఫ్ అలీ కుమార్తె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ట్విట్టర్లో "తన కుమార్తె మృతి పట్ల అసిఫ్ అలీ కుటుంబానికి మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అసిఫ్ కుటుంబానికి మా ఆలోచనలు, ప్రార్ధనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆసిఫ్ బలం, ధైర్యం యొక్క గొప్ప ఉదాహరణ. అతను మాకు ఒక ప్రేరణ" అని ట్వీట్ చేసింది.
ఆదివారం హెడెంగ్లే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి వన్డేలో అసిఫ్ అలీ 22 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో పాక్ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరిస్ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుంది. ఈ సిరిస్లో అసిఫ్ అలీ మెరుగైన ప్రదర్శన చేశాడు. మొత్తం ఐదు వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలతో మెరిశాడు.
బ్రిస్టల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో అసిఫ్ అలీ తన కెరీర్ బెస్ట్ (52) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. పాకిస్థాన్ తరుపున ఇప్పటివరకు 16 వన్డేలాడిన అసిఫ్ అలీ 31.09 యావరేజితో 342 పరుగులు చేశాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్కప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.