ముల్తాన్: పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. విజయం రెండు జట్లను ఊరిస్తోంది. పాకిస్థాన్ విజయానికి మరో 157 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 6 వికెట్లు కావాలి. నాలుగో రోజు ఫస్ట్ సేషన్ ఆట ఫలితాన్ని తేల్చనుంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచి ఉత్సాహంగా ఉన్న ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించి ముల్తాన్ సుల్తాన్ అవుతుందా? లేదా పాకిస్థాన్ బ్యాటర్లకు అవకాశం ఇచ్చి ఓటమికి తల వంచుతుందా? అనేది చూడాలి.
ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. 355 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 198 పరుగులు చేసింది. క్రీజులో సౌద్ షకీల్(54 బ్యాటింగ్), ఫహీమ్ అష్రఫ్(3 బ్యాటింగ్) ఉన్నారు. బ్యాడ్ లైడ్ కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపేసారు.
అంతకుముందు 202/5 ఓవర్ నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 64.5 ఓవర్లలో 5 వికెట్లకు 275 పరుగులకు కుప్పకూలింది.హరీ బ్రూక్(149 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 108) సెంచరీతో చెలరేగగా.. బెన్ డక్కెట్(98 బంతుల్లో 6 ఫోర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అరంగేట్ర స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ మరోసారి 4 వికెట్లతో ఓవరాల్గా 10 వికెట్ల ఘనతను అందుకోగా.. జాహీద్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టాడు.
మహమ్మద్ నవాజ్కు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో అబ్రర్ అహ్మద్(7/114) ధాటికి 281 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్లో పాకిస్థాన్ 202 పరుగులకే ఆలౌటవ్వడంతో ఇంగ్లండ్కు 79 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ లీడ్తో పాక్ ముందు 355 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
ఈ భారీ లక్ష్యచేధనలో పాకిస్థాన్ పోరాడుతోంది. ఓపెనర్లు అబ్దుల్ షఫీక్(45), మహమ్మద్ రిజ్వాన్(30) శుభారంభం అందించగా.. కెప్టెన్ బాబర్ ఆజామ్(1) విఫలమయ్యాడు. సౌద్ షకీల్తో కలిసి ఇమామ్ ఉల్ హక్(60) ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్కు 108 పరుగులు జోడించిన అనంతరం అతను ఔటయ్యాడు. పూర్తిగా స్పిన్కు అనుకూలిస్తున్న ఈ పిచ్పై పాకిస్థాన్ ఇంకా 157 పరుగులు చేయడం చాలా కష్టం.