ఇంగ్లాండ్తో సిరీస్లో రాణిస్తున్న హరీస్ రౌఫ్
స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్థాన్ ప్రస్తుతం 3-2తేడాతో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్పై రౌఫ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించి ఐదు మ్యాచ్ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. నాలుగో మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్తో అదరగొట్టాడు. అయిదో మ్యాచ్లో రెండు కీలక వికెట్ల తీశాడు. ఈ మ్యాచ్ అనంతరం ప్రెస్తో మాట్లాడుతూ... ఎంసీజీలో భారత బ్యాటర్లకు వ్యతిరేకంగా ఎలా బౌలింగ్ చేయాలో తాను ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని రౌఫ్ పేర్కొన్నాడు.
మెల్ బోర్న్ నా హోమ్ గ్రౌండ్
'నేను గనుక నా బెస్ట్ ప్రదర్శన ఇస్తే భారత బ్యాటర్లు తట్టుకోలేరు. రాబోయే ప్రపంచకప్ మ్యాచ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నేను మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఎన్నో మ్యాచ్లు ఆడాను. అందువల్ల నాకు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా జరగడం చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాష్ లీగ్లో ఆడుతున్నప్పుడు మెల్బోర్న్ నా హోమ్ గ్రౌండ్. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు ఓ ఆలోచన ఉంది. నేను భారత్పై ఎలా బౌలింగ్ చేయాలో ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకుని పెట్టుకున్నా' అని ఇంగ్లాండ్తో జరిగిన అయిదో టీ20 మ్యాచ్ తర్వాత హారిస్ రౌఫ్ చెప్పాడు.
ఎప్పుడూ హై ప్రెషర్ మ్యాచే..
ఇకపోతే హారీస్ రౌఫ్ 2021 టీ20 ప్రపంచకప్లో భారత్పై ఒక వికెట్ సహా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అతను ఇటీవల ముగిసిన 2022 ఆసియా కప్లో ఆరు మ్యాచ్లలో ఎనిమిది వికెట్లతో రాణించాడు. అయితే భారత జట్టుపై అతని ప్రదర్శన అంత పెద్దగా ఏం లేదు. ఆసియాకప్లో భారత్తో జరిగిన రెండు మ్యాచ్లలో రౌఫ్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. రెండు గేమ్లలో 8.75, 9.50పేలవమైన ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. గతేడాది ప్రపంచకప్లో భారత్పై ప్రదర్శన సందర్భంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. అయితే ఆసియాకప్ మ్యాచ్లలో మాత్రం చాలా తక్కువ ఒత్తిడిని అనుభవించానని రౌఫ్ వెల్లడించాడు. 'భారత్-పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ హై ప్రెషర్గా సాగుతుంది. గతేడాది ప్రపంచకప్లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఆసియాకప్లో గత రెండు మ్యాచ్లలో నేను పెద్దగా ఒత్తిడికి ఫీల్ కాలేదు. నేను నా బెస్ట్ అందించడానికి ప్రయత్నం చేశా.' అని రౌఫ్ అన్నాడు.