హైదరాబాద్: గతేడాది జరిగిన మహిళల వరల్డ్ కప్లో భారత జట్టుని ఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ ఉద్యోగ విషయంలో ఓ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. హర్మన్ ప్రీత్ కౌర్ గత మూడేళ్లుగా స్పోర్ట్స్ కోటాలో పశ్చిమ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే మహిళల వరల్డ్ కప్లో హర్మన్ ప్రీత్ అద్భుత ప్రదర్శనకు గాను పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ ప్రస్తుతం తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది.
అయితే ఆమెను రిలీవ్ చేసేందుకు పశ్చిమ రైల్వే ససేమిరా అంటోంది. అంతేకాదు ఆమె తమతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుందని, వెళ్లాలనుకుంటే ఐదేళ్ల జీతం రూ. 27 లక్షలను కట్టి వెళ్లాలని పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ తేల్చి చెప్పారు.
దీంతో ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ లేఖ రాశారు. అందులో హర్మన్ ప్రీత్ కేసుని వేరే కోణంలో చూడాలని ఆమె రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు.
అంతేకాదు ఆమె రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ ఉద్యోగంలో చేరడం లేదని, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తన సొంత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగంలో చేరుతోందని పేర్కొన్నారు. రైల్వేస్ బాండ్ పేరిట ఆమెను డీఎస్పీ ఉద్యోగంలో చేరనివ్వడం లేదని, ఇది అన్యాయమని ఆయన లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ఈ విషయంపై హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ తాను మూడేళ్లు విధులు నిర్వర్తిస్తే ఐదేళ్ల జీతాన్ని అడుగుతున్నారని, అసలు గత ఐదు నెలలుగా రైల్వేస్ నుంచి జీతం కూడా అందడం లేదని ఆరోపించింది. ఇప్పుడు తాను ఉద్యోగం లేకుండా ఉన్నానని, అటు రైల్వేస్ నుంచి ఇటు పంజాబ్ ప్రభుత్వం నుంచి వేతనం రావడం లేదని వాపోయింది.
కాగా పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ 'స్పోర్ట్స్ కోటా కింద రైల్వే బోర్డు రిక్రూట్ చేసుకుంటే వారు ఐదేళ్ల పాటు బాండ్ నిబంధనలను పాటించాల్సిందే. ఏదైనా జరిగి వారి ముందుగా ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావిస్తే, ఐదేళ్ల జీతం చెల్లించాల్సిందే. ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తేనే వారు బయటకు వెళ్లేందుకు అర్హులు' అని అన్నారు.
గత అక్టోబర్ చివర్లో డీఎస్పీ విధుల్లో చేరడానికి హర్మన్ప్రీత్ పంజాబ్ పోలీసు శాఖ అధికారులను సంప్రదించింది. కానీ రైల్వేస్ ఆమె రాజీనామాను ఆమోదించని కారణంగా తామేమీ చేయలేమని పోలీసు శాఖ చెప్పింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.