హైదరాబాద్: హోరాహోరీ సమరానికి వేళైంది. బెంగళూరు వేదికగా హైదరాబాద్తో కోహ్లీ సేన పోరాడనుంది. ప్లేఆఫ్ ఆశలు నిలుపుకునేందుకు బెంగళూరు, రికార్డులు దాటేయాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ పోటీపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోతే ఆ జట్టు ప్లేఆఫ్ రేసుకు దూరమైనట్లే. మరో పక్క సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్ రేసుకు దూసుకెళ్లింది. దీంతో ఈ రోజు బెంగళూరుతో జరగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ తన జట్టులో మార్పులు చేస్తుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీనిపై ఆ జట్టు కోచ్ టామ్ మూడీ స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న మూడీ.. 'జట్టులో మార్పులు చేయడం ఎవ్వరికీ ఇష్టం లేదు. ఎందుకంటే టీ20 టోర్నమెంట్లో ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లు ఆడిన జట్లే విజయాలు సాధిస్తాయి. పొట్టి క్రికెట్లో నిలకడ, స్థిరంగా రాణించడం ఎంతో ముఖ్యం. అందుకే మార్పులు లేకుండానే బరిలో దిగాలనుకుంటున్నాం. ఎవరైనా ఆటగాళ్లు గాయాలపాలైతే అప్పుడు ఎలాగూ మార్పులు చేయాలి.'అని వివరించాడు.
'ఇలాంటి సమయంలో తప్ప జట్టులో మార్పులు చేయడం మాకు సంతృప్తికరంగా ఉండదు. లీగ్ దశలో ఆడే మిగతా మ్యాచ్ల్లోనూ ప్రస్తుత జట్టుతోనే బరిలోకి దిగేందుకు చూస్తాం. మొదట మేము ఆలోచించేంది మ్యాచ్లో గెలుపు గురించి, ఆ తర్వాత అదే పదకొండు మంది ఆటగాళ్లు తదుపరి మ్యాచ్ ఆడేందుకు వారిని ఫిట్గా తయారు చేయడం. ఈ రెండింటిపైనే ప్రధానంగా మా దృష్టి' అని మూడీ వెలిబుచ్చాడు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే వీరిద్దరూ మే7న హైదరాబాద్ వేదికగా తలపడగా 5 పరుగుల తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. గురువారం మ్యాచ్లో కోహ్లీ సేన గెలిచి ప్లే ఆఫ్ ఆశల్ని నిలుపుకుంటుందో, లేదా ఓడి ప్లేఆఫ్ రేసుకు దూరమౌతుందా.. అనే సందిగ్ధంలో ఐపీఎల్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.