ఇద్దరూ మలయాళీలే..
దేవ్దత్ పడిక్కల్, సంజు శాంసన్ ఇద్దరూ మలయాళీలే. పడిక్కల్ కుటుంబం కర్ణాటకలో స్థిరపడినప్పటికీ.. జన్మతః అతను మలయాళీ. మళప్పురం జిల్లా ఎడప్పళ్లో అతను జన్మించాడు. అతని కటుంబం తొలుత హైదరాబాద్, ఆ తరువాత బెంగళూరులో స్థిరపడింది. కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్లో పడిక్కల్ శిక్షణ పొందాడు. కర్ణాటక అండర్-16, అండర్-19కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ముంబై వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ను ఢీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్.. మ్యాచ్ మొత్తాన్నీ అతను ఏకపక్షంగా మార్చివేశాడు. ప్రత్యర్థి నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఊది అవతల పారేశాడు. తోటి ఓపెనర్, కేప్టెన్ విరాట్ కోహ్లీతో 181 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. 52 బంతుల్లో 101 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు.
మూడో యంగెస్ట్ ప్లేయర్గా
ప్రత్యేకించి పడిక్కల్ తన బ్యాటింగ్ విన్యాసంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేశాడు. విరాట్ కోహ్లీ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ కూడా అతని పెర్ఫార్మెన్స్ ముందు ప్రేక్షకుడిలా మారిపోయాడు. ఐపీఎల్లో అతి చిన్న వయస్సులో సెంచరీ మార్క్ను అందుకున్న మూడో బ్యాట్స్మెన్ పడిక్కల్. అతని వయస్సు 20 సంవత్సరాల 289 రోజులు. ఈ ఏజ్లో సెంచరీ చేసిన మూడో ఆటగాడతను. అతని కంటే ముందు- మనీష్ పాండే, రిషబ్ పంత్ ఉన్నారు. మనీష్ పాండే-19 సంవత్సరాల 253 రోజులు, రిషబ్ పంత్-20 సంవత్సరాల 218 రోజుల్లో సెంచరీ చేశారు.
సంజు పరిస్థితేంటీ?
పడిక్కల్కు భిన్నంగా ఉంది సంజు శాంసన్ పరిస్థితి. వరుసగా విమర్శలను ఎదుర్కొంటోన్నాడు. నిలకడ లేమి బ్యాటింగ్, కేప్టెన్సీ బాధ్యతలను మోయలేక చతికిల పడుతున్నాడు. తిరువనంతపురానికి చెందిన సంజు.. జట్టు మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని సంజు శాంసన్ నిలబెట్టుకోలేకపోతున్నాడనేది స్పష్టమౌతోంది. అటు కేప్టెన్గా, ఇటు బ్యాట్స్మెన్గా అతను వరుసగా విఫలమౌతున్నాడు. సంజు కేప్టెన్సీలో కొనసాగుతోన్న రాజస్థాన్ రాయల్స్.. ఇప్పటిదాకా ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారింది.
తొలి మ్యాచ్లో సెంచరీ చేసినా..
వరుస వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని సంజు శాంసన్ టాలెంట్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అతను. నిలకడలేమి అతణ్ని వేధిస్తోంది. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో 119 పరుగులు చేసిన అతను ఆ తరువాతి మ్యాచుల్లో ఆ స్థాయిలో రాణించట్లేదు. మ్యాచ్లు సాగుతున్న కొద్దీ రాటుదేలాల్సిన ఆ జట్టు నిస్సారంగా మారింది. విజయం కోసం ముఖం వాచి పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి- ముంబై వాంఖెడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఓడిపోయిన తీరు.. ఆ జట్టును దారుణంగా దెబ్బకొట్టింది. 177 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ..ఏకపక్షంగా దాన్ని కోల్పోవడం జట్టు అస్థిత్వాన్ని చాటుతోంది.