చెలరేగిన వార్నర్..
2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ సూపర్ ఫామ్లో ఉంది. ఎలాంటి స్కోర్లనైనా అలవోకగా ఛేదిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కెరీర్లోనే అత్యద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. నాలుగు సెంచరీలు బాదేశాడు. అలాంటిది చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలవగానే డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 69 ), శిఖర్ ధావన్ (25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28) శుభారంభమే అందించారు.
యువరాజ్ సింగ్ సహకారంతో..
ఆతర్వాత ధావన్, హెన్రిక్స్ (4) త్వరగా ఔట్ అయినప్పటికీ యువరాజ్ సింగ్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38) సహకారంతో వార్నర్ దూకుడు కొనసాగించాడు. వీరిద్దరూ 11 ఓవర్లకే స్కోరును 100 దాటించారు. జట్టు స్కోరు 125 వద్ద వార్నర్ ఔటైనా.. 16.2 ఓవర్లకే స్కోరు 150 దాటినా యువీ, దీపక్ హుడా (3), నమన్ ఓజా (7), బిపుల్ శర్మ (5) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో ఉత్కంఠ కలిగింది. కానీ బెన్కటింగ్ (15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 39 నాటౌట్) విధ్వసంతో జట్టు స్కోర్ 208కి చేరింది. షేన్ వాట్సన్ వేసిన చివరి ఓవర్లో కట్టింగ్ 4, 6, 6, 1, 6తో 26 పరుగులు పిండుకున్నాడు.
గేల్, కోహ్లీ తుఫాను..
ఇక జోరుమీదున్న ఆర్సీబీ అందరూ ఊహించినట్లుగానే పరుగుల సునామీ సృష్టించింది. క్రిస్గేల్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లు 76 ), విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ శుభారంభాన్ని అందించారు. బౌండరీలు మాత్రమే బాదుతా అన్నట్టు గెల్ ఇన్నింగ్స్ సాగడంతో టీమ్ స్కోర్ 6 ఓవర్లకు 59, 8.6 ఓవర్లకు 100 దాటేసింది. దాంతో ఆర్సీబీ విజయం సులువని అంతా భావించారు. కానీ జట్టు స్కోరు 114 వద్ద గేల్ను కటింగ్, 140 వద్ద కోహ్లీని బరిందర్ శరణ్ పెవిలియన్ పంపడంతో బెంగళూరు జోరుకు బ్రేకులు పడ్డాయి.
ఒత్తిడికి చిత్తయి..
15 ఓవర్లకే 150 దాటినా ఏబీ డివిలియర్స్ (5), రాహుల్ (11), వాట్సన్ (11) పరుగులు చేయడంలో విఫలమవ్వడంతో ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి 3 బంతుల్లో 3 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆఖరి 3 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా ఆర్సీబీ 6 పరుగులే చేసింది. దాంతో హైదరాబాద్ విజయం లాంఛనమైంది. వార్నర్ సేన ట్రోఫీని ముద్దాడింది. మరోవైపు ఆర్సీబీ మరో అవకాశాన్ని చేజార్చుకుంది. భువీకి అండగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా రాణించాడు.