శ్రీలంక 230/7..
టాస్ గెలిచిన అజారుద్దీన్ సేన ఫీల్డింగ్ ఎంచుకోగా.. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 230 పరుగులు చేసింది. అసన్క గురుసిన్హా (122 బంతుల్లో 85)టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్కు ఆదిలోని గట్టి షాక్ తగిలింది. నాటి ఓపెనర్ మనోజ్ ప్రభాకర్ 9 పరుగులకే క్యాచ్ ఔటై వెనుదిరిగాడు. అనంతరం సచిన్ టెండూల్కర్ బాధ్యతాయుతంగా ఆడి మంచి పునాది వేసాడు. ఇక 41 పరుగులు చేసిన మాస్టర్ను చంపక రమనయకే ఔట్ చేశాడు.
అజారుద్దీన్-సిద్దూ రికార్డు భాగస్వామ్యం..
తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్(89 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 90 నాటౌట్), నవజ్యోత్ సిద్దూ(106 బంతుల్లో 84 నాటౌట్) 175 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో అలవోక విజాయన్నందించారు. ఈ ఇద్దరి సూపర్ ఇన్నింగ్స్తో భారత్ 8 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకొని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇది భారత్కు వరుసగా నాలుగో ఆసియాకప్. కానీ ఆ తర్వాత మరో 15 ఏళ్లు టీమిండియా ఆసియాకప్ గెలవలేకపోయింది. 2010లో ధోనీ నేతృత్వంలోని భారత్ మళ్లీ ఈ టైటిల్ను ముద్దాడింది.
ఆసియాకప్లో భారత్కు తిరుగు లేదు..
ఇప్పటి వరకు 14 ఎడిషన్లు ఆసియాకప్ జరగ్గా.. అత్యధికంగా భారత్ ఏడు సార్లు విజేతగా నిలిచింది. తర్వాత శ్రీలకం 5 సార్లు గెలుపొందంగా.. పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. ఇక 2018లో జరిగిన సీజన్లో బంగ్లాదేశ్ను ఓడించి భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్కు కరోనా సెగ తగిలింది. ఒకవైపు ఐపీఎల్.. మరో వైపు టీ20 ప్రపంచకప్తో ఈ టోర్నీ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.