నాట్వెస్ట్ సిరీస్కు 18 ఏళ్లు:
నాట్వెస్ట్ ట్రోఫీ గెలిచి నేటికి (జులై 13) సరిగ్గా 18 ఏళ్లు. ఈ సందర్భంగా ఐసీసీ ప్రత్యేక ట్వీట్ చేసింది. 'సరిగ్గా ఇదే రోజు 18 ఏళ్ల క్రితం. లార్డ్స్లో జరిగిన 2002 నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. మొహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ అద్భుతమైన సెంచరీ బాగస్వామం నెలకొల్పడంతో.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది' అని ఐసీసీ ట్వీట్ చేసింది. ఇక మాజీలు అందరూ తమ మధుర స్మృతులను నెమరువేసుకుంటున్నారు.
దులు తీర్చుకున్న గంగూలీ:
ముంబైలో ఇంగ్లీష్ ఆల్రౌండర్ ఆండ్రు ఫ్లింటాఫ్ చేసినదానికి (జెర్సీ విప్పి సంబరాలు) సౌరవ్ గంగూలీ బదులిచ్చాడు. లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పేసి గిరగిరా తిప్పుతూ సంబరాలు చేశాడు. ఇప్పటికీ ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒకానొక సందర్భంలో ఇదే విషయాన్ని దాదాను జెఫ్రీ బాయ్కాట్ అడిగాడు. 'బాయ్.. లార్డ్స్ అంటే అంతర్జాతీయ క్రికెట్కు మక్కాలాంటిది కదా! చొక్కా విప్పొచ్చా? అని బాయ్కాట్ అడగ్గా.. మరి.. వాంఖడే మాకూ లార్డ్స్ లాంటిదే. ఫ్లింటాఫ్ అలా చేయొచ్చా' అని దాదా బదులిచ్చాడట. ప్రస్తుతం నాట్వెస్ట్ ఫైనల్ మధురస్మృతులను అభిమానులు సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు.
|
చిరస్మరణీయంగా యువీ, కైఫ్ ఇన్నింగ్స్:
326 పరుగుల లక్యంతో దిగిన భారత్ ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్లు గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6), వీరేంద్ర సెహ్వాగ్ (45; 48 బంతుల్లో 7×4) చెలరేగి ఆడారు. దాంతో 15 ఓవర్లలోపే భారత్ 106 పరుగులు చేసింది. కానీ ఇంగ్లీష్ బౌలర్లు పుంజుకొని 24 ఓవర్లకే 146కు 5 వికెట్లు పడగొట్టారు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, నయన్ మోంగియా విఫలమయ్యారు. యువరాజ్, కైఫ్ ఆదుకోవడంలో భారత్ గెలుపుపై నమ్మకంగా ఉంది. ఈ జోడి ఆరో వికెట్కు 121 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యువీ పెవిలియన్ చేరాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్ బ్యాటింగ్ చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ను టీమిండియాకు అందించాడు. చివరివరకూ క్రీజులో ఉండి జహీర్ ఖాన్ కూడా అద్భుతంగా ఆడాడు.
అమితాబ్ బచ్చన్లా ఫీల్ అయ్యా:
ఫైనల్ మ్యాచ్ విజయం సాధించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మహ్మద్ కైఫ్ తెలిపాడు. ఆ మ్యాచ్ జరిగి 18 ఏళ్లు గడిచినా తనకు ఇప్పటికీ అదో ప్రత్యేకమైన మ్యాచ్ అని వివరించాడు. 'ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చొక్కా విప్పి వేడుక చేసుకున్న గంగూలీ కెప్టెన్సీని అందరూ మెచ్చుకున్నారు. అంతేకాకుండా భారత్ కూడా భారీ స్కోర్లను ఛేజ్ చేయగలదన్న నమ్మకం అభిమానులకు కలిగించింది. ముఖ్యంగా 1983 తర్వాత లార్డ్స్ మైదానంలో భారత్ గెలిచిన రెండో మ్యాచ్ అదే కావడం విశేషం. దీంతో భారత కీర్తి ఎంతో పెరిగింది. మ్యాచ్ అనంతరం నేను తిరిగివచ్చేసరికి మా ఊరు అలహాబాద్లో ఎక్కడ చూసినా వేడుకలే. నన్ను ఓపెన్ టాప్ జీప్లో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఎంతో గర్వం కలిగింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్లా ఫీల్ అయ్యాను. ఆ మ్యాచ్ తరువాత అందరూ నన్ను ఫాలో అవడం మొదలెట్టారు' అని తెలిపాడు.