హైదరాబాద్: భారత మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియా సాధించడంలో యువీ ముఖ్య పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్లో తనలోని పెను విధ్వంసంను ప్రపంచానికి చూపాడు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున (2007 సెప్టెంబర్ 19) యువరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. 14 ఏళ్లు గడిచినా.. అభిమానుల మనసుల్లో ఆ ఇన్నింగ్స్ చెరిగిపోని రికార్డులుగా నిలిచింది. ఆ మధుర ఇన్నింగ్స్ను మరోసారి గుర్తుచేసుకుందాం.
2007 సెప్టెంబర్ 19న దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్లు తలపడ్డాయి. రేసులో నిలవాలంటే.. టీమిండియాకు అది తప్పక గెలవాల్సిన మ్యాచ్. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ క్రీజులో ఉన్నారు. అప్పటికి భారత్ స్కోర్ మూడు వికెట్లకు 171. ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
ఆ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) అద్భుతమై ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఔటయ్యారు. అనంతరం 19 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు రాబిన్ ఊతప్ప (6) ఔటయ్యాక.. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (10), యువరాజ్ సింగ్ (58: 16 బంతుల్లో 3x4, 7x6) క్రీజులోకి వచ్చారు. చివరి మూడు ఓవర్లలో వీరిద్దరూ నాలుగో వికెట్కు 61 పరుగులు జోడించగా.. యువరాజ్ ఏకంగా 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆండ్రూ ప్లింటాఫ్ బౌలింగ్లో యువరాజ్ వరుసగా 4, 4 బాదాడు. యువీపై ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆ కోపం తర్వాత ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో చూపించాడు.
IPL 2021: 27 రోజులు.. 31 మ్యాచ్లు! డీసీతో ఎస్ఆర్హెచ్ మొదటి ఫైట్! ఐపీఎల్ సెకండాఫ్ షెడ్యూల్ ఇదే!!
ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 ప్రపంచకప్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఆ తర్వాత ఓవర్లో బౌలింగ్కి వచ్చిన ప్లింటాఫ్.. ఓ సిక్స్ బాదిన అనంతరం యువీని ఔట్ చేశాడు. మొత్తంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను ధోనీసేన 200 పరుగులకే కట్టడి చేయడంతో.. ఈ మ్యాచ్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించిన భారత్.. తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
#OnThisDay in 2007, Yuvraj Singh did THIS to Stuart Broad 🤯
— Wisden India (@WisdenIndia) September 19, 2020
Is the moment that gripped you to T20 cricket? pic.twitter.com/OE4urnbdUY
యువరాజ్ సింగ్ కెరీర్.. టీ20 ప్రపంచకప్ ముందు ఆ తర్వాత అనేంతలా సాగింది. 2007 టీ20 ప్రపంచకప్ని గెలిచిన భారత్.. ఆ తర్వాత యువరాజ్ దూకుడుతో 2011 వన్డే ప్రపంచకప్లోనూ విజేతగా నిలిచింది. ఐతే 2014 నుంచి యువీ కెరీర్ గాడి తప్పింది. కాన్సర్ బారిన పడడం, జట్టులోపోటీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక 2019లో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.