హైదరాబాద్: సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఏప్రిల్ 6న టీమిండియా ఓ అద్భుతమైన అవకాశాన్ని జారవిడింది. ఐసీసీ వరల్డ్ టీ20 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. 2014లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియాపై శ్రీలంక ఆరు వికట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి వరల్డ్ టీ20 టైటిల్ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులు చేసింది. ఆరంభంలో కాస్త దూకుడుగా ఆడినప్పటికీ, చివర్లో భారత్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. దీంతో భారత్ స్వల్ప లక్ష్యానికే పరిమితమైంది. చివర్లో కోహ్లీ 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 77 రాణించడంతో ఆ మాత్రం స్కోరన్నా చేయగలిగింది.
#OnThisDay in 2014, Sri Lanka won #WT20! @KumarSanga2's 52* in his final T20I helped his nation to their first title with a 6 wicket win in Dhaka! 🏆 pic.twitter.com/o4lQKuHOEw
— ICC (@ICC) April 6, 2018
అదే సమయంలో క్రీజులో ఉన్న యువరాజ్ సింగ్ 21 బంతుల్లో 11 పరుగులే చేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అనంతరం భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి నిర్ణీత లక్ష్యాన్ని చేధించింది. శ్రీలంక జట్టులో సంగక్కర (52: 35 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో హాఫ్ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ విజయంతో శ్రీలంక తొలిసారి ఐసీసీ వరల్డ్ టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం శ్రీలంక సీనియర్ క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు.