
హైదరాబాద్: ప్రపంచ క్రికెట్లో బంగ్లాదేశ్ జట్టు ఎప్పుడూ సంచలనమే. పసికూనగా క్రికెట్లోకి అడుగుపెట్టినా.. అద్భుత ఆటతో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, భారత్ లాంటి టాప్ జట్లను మట్టికరిపించిన సందర్భాలు ఉన్నాయి. సంచలనాలకు ప్రతిరూపంగా నిలిచే బంగ్లా.. ఐసీసీ టోర్నీలలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే బంగ్లా క్రికెట్ జట్టు అపూర్వ విజయం సాధించి ప్రపంచ గుర్తింపు పొందింది మాత్రం 1999 మే 31.
1999 ప్రపంచకప్ బంగ్లాదేశ్ అపూర్వ విజయం సాధించింది. ఈ విషయాన్ని ఐసీసీ తమ ట్విట్టర్లో పేర్కొంటూ.. బంగ్లా స్టన్నింగ్ పెర్ఫామెన్స్ అని ప్రశంసించింది. 1999 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. టోర్నమెంట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన పాకిస్థాన్.. వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు క్రికెట్లో అడుగు పెట్టిన బంగ్లాదేశ్కు అది తొలి ప్రపంచకప్. ఇక టోర్నమెంట్లోని 29వ మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడాల్సి వచ్చింది.
ఆ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సక్లయిన్ ముస్తాక్ 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకోగా.. వకార్ యునీస్ రెండు వికెట్లు తీశారు. వసీం అక్రమ్, అఫ్రీది చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో పటిష్ట బ్యాటింగ్ కలిగి ఉన్న పాకిస్థాన్కు విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే అక్కడే అద్భుతం చోటు చేసుకుంది.
కట్టుదిట్టమైన బౌలింగ్తో పాక్ జట్టును బంగ్లా బౌలర్లు బెంబేలెత్తించారు. 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తీవ్ర ఒత్తిడిలో పడిపోయిన పాక్.. తర్వాత కోలుకోవడం కష్టంగా మారింది. దీంతో 161 పరుగులకే పాక్ ఆలౌట్ అవ్వడంతో.. బంగ్లా 62 పరుగుల తేడాతో అపురూపమైన విజయాన్ని చేసుకుంది. బంగ్లా బౌలర్ ఖలీద్ మహ్మద్ 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్లో 34 బంతులాడి 27 పరుగులు చేశాడు. దీంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' సొంతం చేసుకున్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటం వల్లే తాము విజయం సాధించామని ఖలీద్ తెలిపాడు.