తొలి 6 బంతులలో ఒక్క పరుగు కూడా:
బెంగుళూరు జట్టు కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ టాస్ గెలిచి కోల్కతాను ఫీల్డింగ్కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన మెక్కల్లమ్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేకేఆర్ తరపున బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్మెన్ మెక్కల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు మెక్కల్లమ్.
పరుగుల సునామీ మొదలైందిలా:
ఆ తర్వాతి నాలుగు బంతుల్లో 18 పరుగులు చేసి ఖాతా తెరిచాడు. అంతే ఇక ఏ బౌలర్ కూడా మెక్కల్లమ్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక పోయారు. కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్లతో 158 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన మెక్కల్లమ్ రికార్డు నెలకొల్పాడు. మెక్కల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో 222 పరుగుల ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్.
82 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్:
క్రికెట్ అభిమానులకు కొత్త అనుభవాన్ని మిగిల్చిన ఈ మ్యాచ్లో బౌలింగ్ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్లోనూ చతికిల పడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 82 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెక్కల్లమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధించడంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఐపీఎల్ 11లో కేవలం 47 పరుగులు మాత్రమే:
ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 106 మ్యాచులాడిన మెక్కల్లమ్ 2801 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ సీజన్ 11లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మెక్కల్లమ్ ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతవరకు తన మార్క్ ప్రదర్శనను కనబరచకపోవటం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.