ఐపీఎల్ నిరవధిక వాయిదా:
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021ను బీసీసీఐ మంగళవారం నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 60 మ్యాచుల టోర్నీలో 29 మ్యాచులు ముగిసిన తర్వాత ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. కోల్కతా బౌలర్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి.. సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ పాజిటివ్గా తేలారు. దీంతో బయో బుడగ బలహీనంగా మారింది. ఉన్నపళంగా సమావేశమైన బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి.. ఐపీఎల్ 2021ను వాయిదా వేసింది.
వాయిదా వేయండని ముందే చెప్పా:
ఐపీఎల్ 2021 వాయిదా వేయడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఓ వీడియో పోస్ట్ చేసి అందులో మాట్లాడాడు. 'ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడింది. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. రెండు వారాల క్రితమే వాయిదా వేయాలని బీసీసీఐకి సూచించాను. భారత్లో ప్రస్తుత కరోనా సంక్షోభంలో మనుషుల ప్రాణాలు కాపాడటం కన్నా.. మరేదీ ముఖ్యం కాదు' అని అక్తర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ రద్దవ్వడంతో మిగిలన 31 మ్యాచ్లు నిర్వహించే అవకాశాల కోసం బీసీసీఐ ఆలోచిస్తుంది. కరోనా ఉధృతి తగ్గితే.. సెప్టెంబర్లో మ్యాచ్లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
భారత్కు సహాయచేద్దాం:
ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్కు సహాయచేద్దామని తన యూట్యుబ్ చానెల్ వేదికగా అక్తర్ పాక్ ప్రజలను ఇదివరకే కోరాడు. 'మా ప్రభుత్వం, అభిమానులను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజన్ ట్యాంకులు కావాలి. ప్రతి ఒక్కరూ ఇండియా కోసం విరాళాలు సేకరించి, వాళ్లకు అవసరమైన ఆక్సిజన్ ట్యాంకులను అందించాలని కోరుతున్నా' అని వీడియోలో అక్తర్ కోరాడు. అంతకుముందు కూడా ఇండియాలో కరోనా తీవ్రతను గమనించిన అక్తర్.. సాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరాడు.