హైదరాబాద్: 2018-2022 కాలానికి స్టార్ ఇండియా రూ.16,347 కోట్లకు ఐపీఎల్ మీడియా హక్కులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద మీడియా హక్కుల ఒప్పందంగా ఇది నిలిచింది. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన వేలంలో విపరీతమైన పోటీ నెలకొన్నప్పటికీ, అత్యధిక బిడ్ వేసిన స్టార్ ఇండియానే హక్కులను దక్కించుకుంది.
భారత్లో టీవీ, భారత్లో డిజిటల్ హక్కులకు వేర్వేరుగా అమెరికా, ఐరోపా, మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, ఇతర ప్రపంచ దేశాల టీవీ, డిజిటల్ హక్కులకు కలిపి.. మొత్తం ఏడు బిడ్లు నిర్వహించగా అన్నింటికీ కలిపి ఉమ్మడిగా అత్యధిక ధర కోట్ చేసిన స్టార్ ఇండియానే హక్కులను సొంతం చేసుకుంది.
దీంతో 2018 నుంచి 2022 వరకు ప్రసారమయ్యే ఐపీఎల్ టోర్నీని స్టార్ స్పోర్ట్స్లో చూడబోతున్నాం. టెలివిజన్ హక్కులతో పాటు డిజిటల్ హక్కులు కూడా స్టార్ ఇండియానే సొంతం చేసుకుంది. డిజిటల్ హక్కుల కోసం ఒక్కో ఐపీఎల్ మ్యాచ్కు రూ. 55 కోట్లు చెల్లించేందుకు స్టార్ ఇండియా సిద్ధమైంది.
ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకున్న అనంతరం స్టార్ ఇండియా ఛైర్మన్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. 'ఐపీఎల్ను బలమైన ఆస్తి అని నమ్మాం. టీవీ, డిజిటల్ మార్గాల ద్వారా మరింత విలువను తీసుకురాగలమని భావించాం. అన్ని హక్కులూ పొందడానికి సిద్ధపడే బిడ్డింగ్కు వెళ్లాం' అని అన్నారు.
'అన్ని హక్కులను చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్ విలువను పెంచేందుకు బీసీసీఐ చక్కటి ప్రణాళికతో ముందుకొచ్చింది. హక్కుల్ని విభజించి బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించడం వల్ల ఆయా సంస్థల ఆసక్తికి తగ్గట్లుగా బిడ్లు వేశాయి. టీవీతో పాటు డిజిటల్ ప్రసారంలో ఉన్నాం. హాట్స్టార్ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఐపీఎల్ ఓ సాధనంగా పనికొస్తుంది' అని అన్నారు.
ఇందులో భాగంగానే అన్ని హక్కుల కోసం పోటీ పడ్డామని అన్నారు. బిడ్డింగ్లో తామేమీ ఎక్కువ ధరకు కోట్ చేయలేదని, తక్కువకూ బిడ్లు వేయలేదని అన్నారు. హక్కులను దక్కించుకునే క్రమంలో ధర కొంచెం తగ్గించి ఉంటే హక్కులను కోల్పోయేవాళ్లమని చెప్పుకొచ్చారు.