సిడ్నీ: ఐపీఎల్ 2020 వేలంలో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫించ్ కనీస ధర 1 కోటి ఉండగా.. రూ. 4.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఫించ్ కోసం కోల్కతా, బెంగళూరు ఫ్రాంఛైజీల మధ్య హోరాహోరీ నడిచింది. అయితే ఆర్సీబీకి ఫించ్ వెళ్లడంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ట్వీట్ చేసింది. 'వేలంలో ఆసీస్ స్టార్ ఆరోన్ ఫించ్ ఆర్సీబీకి వెళ్లాడు. కొత్త జట్టు సభ్యులు అతడిని ఇష్టపడతారని ఆశిస్తున్నాం' అని రాసుకొచ్చింది.
IPL 2020: అత్యధికంగా 11 మందిని తీసుకున్న రాజస్థాన్ రాయల్స్.. పూర్తి జట్టిదే!!
సీఏ ట్వీట్తో పాటు ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఆరోన్ ఫించ్, టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ ఐపీఎల్ గురించి సరదాగా మాట్లాడుకున్నారు. 'ఐపీఎల్లో ఇప్పటికీ ఎన్నో జట్లు మారావు. ప్రతి జట్టులో ఆడుతున్నావ్' అని ఫించ్ను పైన్ అన్నాడు. 'అవును అది నిజమే. ఒక్క ఆర్సీబీకి తప్ప' అని ఫించ్ బదులిచ్చాడు. 'ఆర్సీబీ నిన్ను ఎందుకు తీసుకోలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్ను ఇష్టపడడా?' అని పైన్ మళ్లీ అడిగాడు. 'నన్ను ఎవరూ ఇష్టపడరు. అందుకే అన్ని జట్లలో ఆడుతున్నాను' అని ఫించ్ సరదాగా అన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.
Aussie star Aaron Finch is off to @RCBTweets in the #IPLAuction2020. Let's hope his new teammates like him 😂😂😂 pic.twitter.com/VGfUFfJffq
— cricket.com.au (@cricketcomau) 19 December 2019
దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ను వేలంలో రూ. 10 కోట్లు పెట్టి బెంగళూరు దక్కించుకుంది. ఇటీవలి కాలంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న మోరిస్ అనూహ్య ధర పలికాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు మోరిస్ కోసం ఏకంగా పది కోట్లు వెచ్చించడం విశేషం. దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్, ఆసీస్ ఆటగాడు కేన్ రిచర్డ్సన్లను కూడా ఆర్సీబీకి దక్కించుకుంది. కేన్ రిచర్డ్సన్ రూ.4 కోట్లు, స్టెయిన్ను రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది.
అయితే మొదటగా స్టెయిన్ రెండు సార్లు వేలానికి వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. మూడోసారి వేలంలో అతడిని కనీస ధర రూ. 2 కోట్లకు బెంగళూరు ఎంచుకుంది. కీలక ఆటగాళ్లతో పాటు ఇసురు ఉదాన (రూ. 50 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ. 20 లక్షలు), జోషువా ఫిలిప్ (రూ. 20 లక్షలు), పవన్ దేశ్పాండే (రూ. 20 లక్షలు)లు కూడా ఆర్సీబీ జట్టులో చేరారు.