ఆడాల్సింది 13: 'వరల్డ్ కప్ వరకు జట్టులో మార్పులు, చేర్పులు ఉండవు'

హైదరాబాద్: వరల్డ్ కప్ వరకు టీమిండియా 13 వన్డేలు ఆడాల్సి ఉండటంతో, జట్టులో ఇకపై ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదని హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్ కోసం ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్లే దాదాపుగా వరల్డ్కప్నకు వెళ్లే జట్టులో ఉంటారని పరోక్షంగా చెప్పాడు.
ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా గురువారం భారత్ నుంచి బయల్దేరనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి హెడ్ కోచ్ రవిశాస్త్రి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ "వన్డే జట్టులో మార్పులు, చేర్పుల సమయం ముగిసిపోయింది. ఇప్పుడంతా ఉన్న వాళ్లలో నుంచి మెరుగైన తుది జట్టును ఎంపిక చేసుకోవడమే" అని అన్నాడు.

ఎంపిక చేసే 15 మంది జట్టే దాదాపుగా వరల్డ్ కప్లో
"ఇప్పుడు ఎంపిక చేసే 15 మంది జట్టే దాదాపుగా వరల్డ్ కప్లో ఆడనుంది. ఆటపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పట్నించి సమిష్టిగా ఆడుతూ జట్టు విజయాలబాట పట్టాలి. ఎక్కువగా గాయాలు కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సమయంలో వేరే విషయాలను పట్టించుకోకుండా తుది జట్టు గురించే ఆలోచించాలి" అని రవిశాస్త్రి అన్నాడు.

మాకు 13 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి
"ఎందుకంటే మాకు 13 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఇందులో ఆడటం ద్వారా అత్యుత్తమైన జట్టేదో ఎంచుకోవాలి. భారత జట్టు ఆడే 13 మ్యాచ్ల్లో.. విదేశాల్లో ఆస్ట్రేలియాతో మూడు, న్యూజిలాండ్తో ఐదు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్ల నుంచి చాలా నేర్చుకున్నాం. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియా పురోగతి చాలా బాగుంది" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

వాస్తవ ప్రదర్శనలో మేం చాలా ముందున్నాం
"ఇంగ్లాండ్లో సిరీస్ తేడాను పక్కనబెడితే వాస్తవ ప్రదర్శనలో మేం చాలా ముందున్నాం. విదేశీ గడ్డపై కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో అలా ఆడటమంటే మామూలు విషయం కాదు. మొత్తంగా మా ప్రదర్శనపై చాలా సంతృప్తిగా ఉన్నాం. గత పర్యటనల నుంచి ఆటగాళ్లు కూడా చాలా నేర్చుకున్నారు" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

క్రికెటర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు
"క్రికెటర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనల తప్పులను ఆసీస్లో చేయబోయం. మంచి పోటీ క్రికెట్ ఆడుతాం. టెస్ట్ క్రికెట్ చాలా భిన్నంగా ఉంటుంది. వరల్డ్కప్నకు ముందు ఇది చివరి సిరీస్ కావడంతో గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్నాం. కాబట్టి సిరీస్ మొత్తంపై మేం దృష్టిపెట్టాం" అని రవిశాస్త్రి అన్నాడు.

నవంబర్ 21 నుంచి భారత్-విండిస్ జట్ల మధ్య టీ20 సిరిస్
నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్తో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటన ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్ జట్టును చిత్తుచేసిన టీమిండియా ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తోంది.

ఆసీస్ గడ్డపై ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను
ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్ను గెలిచి కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications