ముంబై: మహారాష్ట్రలో తీవ్ర నీటి సమస్య నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ తర్వాత ఐపీఎల్ మ్యాచులు ఆడటానికి వీల్లేదని బాంబే హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. అప్పటి దాకా మ్యాచులు కొనసాగించవచ్చునని తెలిపింది. మే నెలలో మ్యాచులు వద్దని చెప్పడం బీసీసీఐకి షాక్.
తీవ్ర కరువుతో మహారాష్ట్రలో ఓ పక్క ప్రజలు దాహార్తితో అలమటిస్తుంటే ఐపిఎల్ మ్యాచుల కోసం క్రికెట్ పిచ్లు తడిపేందుకు ట్యాంకర్లతో నీటిని తరలించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.
దీంతో తాము తాగునీటినివాడటం లేదని, మురుగునీటిని శుద్ధి చేసుకొని వాడుకుంటున్నామని బీసీసీఐ కోర్టుకు తెలిపింది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు 40 లక్షల నీటిని ఇచ్చేందుకు కూడా సిద్ధమని, రూ.5 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తామని కోర్టుకు తెలిపింది.
దీంతో బీసీసీఐ ద్వారా లాతూర్లో పాటు కరువు తాండవిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు నీరు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్ప్టం చేసింది.
అయితే, ఏప్రిల్ 30 తర్వాత మాత్రం ఐపిఐల్ మ్యాచులు వద్దని, మే నెలలో మరో రాష్ట్రానికి తరలించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 13 మ్యాచుల పైన ప్రభావం పడనుంది. మే నెలలో జరగాల్సిన పదమూడు మ్యాచులు మరో రాష్ట్రానికి తరలించాల్సి ఉంటుంది.