హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు ఉండవు. ఈ విషయాన్ని గుజరాత్ లయన్స్ ప్రాంఛైజీ యజమాని కేశవ్ బన్సాల్ చెప్పారు. బుధవారం ఆయన క్రిక్బజ్కి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఒప్పందం ప్రకారం 2018 ఐపీఎల్లో కొత్తగా వచ్చిన గుజరాత్, పుణె జట్ల స్ధానంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తిరిగి వస్తాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే సీజన్లో తమ జట్టు కొనసాగే అవకాశం ఉంటే సంతోషిస్తానని ఆయన తెలిపారు.
స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను బీసీసీఐ రెండేళ్ల పాటు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రెండు జట్లపై విధించిన నిషేధం ఈ ఏడాదితో పూర్తి కావడంతో వచ్చే సీజన్ నుంచి ఆ రెండు జట్లు తిరిగి ఐపీఎల్ పదకొండవ సీజన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

ఇదిలా ఉంటే ఐపీఎల్లో జట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పుడున్న తరహాలోనే వచ్చే ఏడాదినుంచి కూడా ఎనిమిది జట్లే కొనసాగుతాయని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రీ వెల్లడించారు. ఈ ఏడాదితో చెన్నై, రాజస్థాన్ జట్లపై నిషేధం ముగుస్తున్నందున వచ్చే సీజన్లో ఈ రెండు పునః ప్రవేశిస్తాయని ఆయన అన్నారు.
ఫలితంగా రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఉన్న రైజింగ్ పూణె సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ జట్లను తప్పిస్తామని జోహ్రీ అన్నారు. 'నిషేధం ముగిసిపోతోందని కాబట్టి ఆ రెండు జట్లు యథావిధిగా మళ్లీ వచ్చేస్తాయి. జట్ల సంఖ్యను పదికి పెంచాల్సిన అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది. కాబట్టి గుజరాత్, పుణే ఇక ముందు కొనసాగవు' అని జోహ్రీ అన్నారు.