ఢాకా: మళ్లీ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ను పునరుద్ధరించాలని భావిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు భారీ షాక్ తగిలింది. జనవరి 18 నుంచి జరిగే పర్యటనలో కేవలం టీ20లను మాత్రమే ఆడతామని, టెస్టు సిరీస్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఆదివారం పాకిస్థాన్కు స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా తమ జట్టు పాక్లో పర్యటించడం లేదని ఆయన తెలిపారు. దీంతో బంగ్లాదేశ్తో ఫుల్ సిరీస్ నిర్వహించాలనే పాక్ ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి.
మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్న స్మిత్.. కారణం ఇదే?!!
బంగ్లాదేశ్ తొలుత పాకిస్థాన్లో ఒక టెస్టు, స్వదేశంలో ఒక టెస్టు ఆడేందుకు సిద్దమయింది. అయితే పాకిస్థాన్ అందుకు ఒప్పుకోలేదు. తటస్థ వేదికపైనా ఆడేందుకూ సిద్ధంగా ఉన్నామని బంగ్లా తెలిపినా.. పాక్ అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తొలుత పాకిస్థాన్లో మూడు టీ20ల సిరీస్ ఆడిన తర్వాత భద్రతా విషయాన్ని పరిగణించి టెస్టులపై నిర్ణయం తీసుకుందామని భావించింది.
మధ్యలో ఎంటరైన బంగ్లా ప్రభుత్వం పాక్లో కేవలం టీ20లు మాత్రమే ఆడాలని బీసీబీకి చెప్పింది. ఇదే విషయాన్ని బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ ఆదివారం పీసీబీకి తేల్చిచెప్పాడు. బీసీబీ నిర్ణయంతో పీసీబీ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బంగ్లా నిర్ణయంతో తటస్థ వేదికపై ఆడేందుకు పాక్ దిగివస్తుందో లేదో చూడాలి.
ఇటీవలే పదేళ్ల తర్వాత పాక్లో శ్రీలంక పర్యటించింది. శ్రీలంక జట్టు అక్టోబర్లో రెండు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాక.. డిసెంబర్లో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లింది. టీ20 సిరీస్ను లంక కైవసం చేసుకోగా.. టెస్టు సిరీస్ను పాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ఇటీవలే పాక్లో భద్రత పటిష్టంగా ఉంటుందని వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ అన్నాడు. అక్కడ ఉన్నతస్థాయి భద్రత ప్రమాణాలు పాటిస్తారని ప్రశంసించాడు.