కేవలం 5 నిర్ణయాలే..
భారత్-ఇంగ్లండ్ సిరీస్లో భాగంగా.. నాలుగు టెస్టులు, ఐదు టీ20లకు గాను మూడు మ్యాచ్ల్లో, మూడు వన్డేల్లో నితిన్ అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ సిరీస్లో అతను అంపైర్గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన 40 నిర్ణయాలను సవాలు చేస్తూ ఇరు జట్ల కెప్టెన్లు సమీక్ష కోరగా అందులో కేవలం 5 మాత్రమే నితిన్కు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక ఎల్బీల విషయంలో 35 సమీక్షలకు గాను రెండు మాత్రమే ప్రతికూలంగా వచ్చాయి. ప్రస్తుతం ఐపీఎల్-14వ సీజన్కు సిద్ధమవుతున్న అతను చెన్నైలో క్వారంటైన్లో ఉన్నాడు.
తాజాగా పీటీఐతో మాట్లాడిన నితిన్ మీనన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
మన పనిని మెచ్చుకుంటే..
'గత రెండు నెలలు గొప్పగా గడిచాయి. మనం సమర్థంగా చేసిన పనిని ప్రజలు గుర్తించి, అభినందిస్తే గొప్ప సంతృప్తి కలుగుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య సాగిన సిరీస్ సవాలు విసిరింది. ఇక లిమిటెడ్ ఓవర్ల సిరీస్కు వచ్చేసరికి ప్రపంచంలోనే ఇంగ్లండ్, భారత్ ర్యాంకింగ్స్లో ముందు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. మా అంపైరింగ్ టీమ్ మంచి ప్రదర్శన చేసిందనే సంతోషంతో ఉన్నా' నితిన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ అనుభవం...
'అంపైరింగ్ అనేది మానసికంగా ఎంత దృఢంగా ఉన్నామనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే ఫోకస్ అంత ఎక్కువగా ఉంటుంది. అంత ఒత్తిడిలోనూ మేం చేసే మంచి ప్రదర్శన మా మానసిక బలాన్ని చాటుతుంది. వరుసగా మ్యాచ్ల్లో విధులు నిర్వర్తించడం నాకు కొత్తేమీ కాదు. దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్ల అనుభవం ఈ సిరీస్లో ఉపయోగపడింది. ఆటగాళ్లలాగే అంపైర్లూ ఫామ్లో ఉంటారు. నేను మంచి ఫామ్లో ఉన్నపుడు ఎలాంటి విరామం లేకుండా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లకు పనిచేయాలని అనుకుంటా. అంపైర్గా నా పనిని ఆస్వాదిస్తుంటా. ఒకవేళ అలా చేయకపోతే అది నా ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. అలాగే మ్యాచ్ను ఆస్వాదించడంతో ఒత్తిడి తగ్గించుకుంటా'' అని నితిన్ చెప్పుకొచ్చాడు.