బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 160
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో మహ్మదుల్లా (43 నాటౌట్: 18 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. కానీ చివరి ఓవర్ వేసిన శ్రీలంక బౌలర్ ఉదాన.. తొలి రెండు బంతుల్ని షార్ట్ పిచ్ బంతులుగా విసిరాడు.
నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్లతో బంగ్లా ఆటగాళ్ల గొడవ
అయితే.. వాటిని క్రీజులో ఉన్న ముస్తాఫిజుర్ బ్యాట్తో తాకించలేకపోయాడు. ఈ క్రమంలో రెండో బంతికి పరుగు కోసం ప్రయత్నించి ముస్తాఫిజుర్ రనౌటయ్యాడు. ఈ సమయంలో మహ్మదుల్లాకి డ్రింక్స్ తీసుకొచ్చిన సబ్స్టిట్యూడ్ ఫీల్డర్ నూరుల్.. శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరాతో గొడవపడ్డాడు. బంతి బ్యాట్స్మెన్ భుజం కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. నోబాల్ ఇవ్వాలంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోని అంపైర్లని డిమాండ్ చేశారు.
మ్యాచ్ నిలిపివేసి బయటకు వచ్చేయండి
ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు. అప్పటికి 4 బంతుల్లో బంగ్లా 12 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు. మరోవైపు కెప్టెన్కి బంగ్లాదేశ్ కోచ్, జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు.
4, 2, 6 బాది బంగ్లాకు విజయాన్ని అందించిన మహ్మదుల్లా
ఆ తర్వాత మహ్మదుల్లా వరుసగా 4, 2, 6 బాది ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. గెలుపు అనంతరం బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మైదానంలో సంబరాలతో హోరెత్తించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. మ్యాచ్ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది శ్రీలంక బోర్డుకు ఫిర్యాదుచేశారు.
డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసంపై విచారణ ఆదేశించిన బోర్డు
దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది.