రోహిత్ శర్మ నిలబడితేనే!
కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతుండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ధావన్ తన జోరుని ప్రదర్శిస్తున్నాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో ధావన్ ఫామ్లో ఉండడం సానుకూలాంశం. గత ఐదు టీ20 ఇన్నింగ్స్ల్లో ధావన్ 55, 90, 47, 24, 72 స్కోరు చేయడం చూస్తే అతని జోరు ఎలా ఉందో చెప్పొచ్చు. వీరిద్దరూ గనుక ఈ మ్యాచ్లో కుదురుకుంటే ప్రత్యర్ధి జట్టుకు చిక్కులు తప్పవు.
ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం
కీలకమైన మ్యాచ్ కావడంలో రోహిత్ శర్మ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రోహిత్ కుదురుకుంటే భారత్ సునాయసంగా రెండొందల పరుగుల మార్క్ను దాటగలదు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక, మిడిలార్డర్ విషయానికి వస్తే, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై భారీ అంచనాలు పెట్టుకోవడంతో అతడు తొలి మ్యాచ్లో (23) ఫరవాలేదనిపించాడు.
కేఎల్ రాహుల్కు ఛాన్స్
ఇక, రెండో మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు, దీంతో యువ ఆటగాడు రిషభ్ పంత్కు మరో అవకాశం ఇవ్వాలా వద్దా అనేదానిపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. కేఎల్ రాహుల్ రూపంలో మరో నాణ్యమైన బ్యాట్స్మన్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నందున పంత్కు ఈ మ్యాచ్లో మరో చాన్స్ దక్కడం కష్టమే. రాహుల్కు అవకాశమిస్తే మూడో నంబర్ లేదా నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ నిలకడగా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
అద్భుతమైన ఫామ్లో చాహాల్
స్పిన్ బౌలర్లు చాహాల్, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నప్పటికీ గత రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జయదేవ్ ఉనాద్కత్ రెండు మ్యాచుల్లో కలిపి నాలుగు వికెట్లు పడగొట్టినా పరుగులు నియంత్రించడంలో విఫలమవుతున్నాడు. ప్రస్తుతం ఫామ్లో ఉన్న చాహల్ మరోసారి లంకపై తన మార్క్ బౌలింగ్ చూపెడితే భారత్కు గెలుపు మరింత సులువవుతుంది.
ఎంతమేరకు శ్రీలంక ప్రభావం
తొలి మ్యాచ్లో భారత్పై గెలిచిన ఆతిథ్య శ్రీలంక, రెండో మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. దీంతో మరోసారి తన ఆధిపత్యం చూపించాలని తహతహలాడుతోంది. సొంతగడ్డపై లంక బ్యాట్స్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా కుశాల్ మెండిస్ (57), కుశాల్ పెరీరా (66,74) సూపర్ ఫాంలో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొన్న కెప్టెన్ చండిమల్ ఈ మ్యాచ్కు దూరమవడంతో తిశార పెరీరా జట్టును నడిపించనున్నాడు. అతడి స్థానంలో ధనంజయ డిసిల్వాను తుదిజట్టులోకి తీసుకోనున్నారు. సొంత పిచ్లపై లంక బ్యాట్స్మెన్ జోరుకు భారత బౌలర్లు ఎంతవరకు అడ్డుకట్ట వేయగలరనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
పిచ్, వాతావరణం
ప్రేమదాస పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ఆకాశం మేఘావృతమై ఉండి రాత్రి వేళలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్(కెప్టెన్), ధవన్, రైనా, రిషబ్/రాహుల్, మనీశ్, దినేశ్, విజయ్శంకర్, చహాల్, సుందర్, జైదేవ్, శార్దూల్, సిరాజ్.
శ్రీలంక: తిసార పెరీరా (కెప్టెన్), గుణతిలక, మెండిస్, పెరీరా, షనక, తరంగ, ధనంజయ, జీవన్, డిసిల్వా, చమీర, ఫెర్నాండో, లక్మల్
మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7 గంటలకు