
హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు శ్రీలంక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీలంక ఈ ఏడాది 70 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.. ఈ నేపథ్యంలోనే భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో చర్చించి నిదహాస్ ముక్కోణపు టీ20 సిరీస్కు ఆతిథ్యం ఇచ్చింది.
ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. వేడుకల్లో పాల్గొనాలని, మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించాలని బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సచిన్కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీనికి సచిన్ స్పందించాడు. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానని తెలిపిన సచిన్ 70ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న లంకకు, ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
నిదహాస్ ట్రోఫీలో భాగంగా 1998 జూలై 7న కొలంబో వేదికగా డై-నైట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెలరేగి ఆడిన ఓపెనర్లు గంగూలీ, సచిన్ టెండూల్కర్ తొలి వికెట్కు 252 పరుగులు చేశారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో తొలి వికెట్కు అత్యధిక పరుగులు సాధించిన జోడీల్లో ఈ జోడీ ఏడో స్థానంలో కొనసాగుతోంది. లంక 50ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించిన సమయంలో భారత్-శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్తో 17వ వన్డే ఆడిన సచిన్ 131 బంతులలో 128పరుగులను చేశాడు. ఇందులో 2 సిక్సులు, 8 ఫోర్లు కూడా ఉన్నాయి. 136 బంతులకు గంగూలీ 109 పరుగులు చేసి 2 ఫోర్లు, 2 సిక్సులతో స్కోరును పరుగుపెట్టించాడు. ఈ మ్యాచ్లో తీవ్రంగా కష్టపడి బౌలింగ్ చేసిన అప్పటి బౌలర్లు విక్రమసింగ్, బందరతిలక, ధర్మసేన, మురళీధరన్కు సచిన్ గంగూలీల జోడీ చుక్కలు చూపెట్టింది. ఈ మ్యాచ్కు గాను భారత స్కోరు 307/6.
ఇదే ట్రోఫీలో లంక సేనను ఎదుర్కొనేందుకు రోహిత్ జట్టు బయల్దేరింది. జట్టులో ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, రిషబ్ పంత్/దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్/ దీపక్ హూడా, యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్.
శ్రీలంక:
చండిమల్ (కెప్టెన్), కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, శనక, తిసారా పెరీరా, అఖిల ధనంజయ, అమిలా అపోన్సో, లక్మల్, చమీరా.
పిచ్, వాతావరణం
ప్రేమదాస మైదానం ఎక్కువగా స్లో పిచ్. అయితే సిరీస్ ఆరంభంలో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృత్తంగా ఉంటుంది.