పంత్, శాంసన్కు మరోమారు నిరాశే:
టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన మేనేజ్మెంట్ పటిష్ఠమైన జట్టు కోసం ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కూర్పును మార్చకుండా బౌలింగ్లో వైవిధ్యం కోసం కుర్రాళ్లకు అవకాశమివ్వనుంది. వికెట్ కీపర్గా విజయవంతమైన కేఎల్ రాహుల్ను కొనసాగించనుండగా.. రిషబ్ పంత్, సంజు శాంసన్కు మరోమారు నిరాశే ఎదురుకావచ్చు.
బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు:
టాపార్డర్లో లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశం. మనీష్ పాండే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుండగా.. శివమ్ దూబే అంతగా సఫలం కాలేకపోతున్నాడు. అయితే దూబే కొనసాగనున్నాడు. పాండే చివర్లో వస్తుండటంతో ఎక్కువ బ్యాటింగ్ అవకాశం దక్కలేదు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుగా పంపించే అవకాశం ఉంది. దూబే కూడా మళ్లీ ముందుగా బ్యాటింగ్కు దిగవచ్చు.
సుందర్, సైనీకి అవకాశం:
నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఈ పర్యటనలో ఇంకా అవకాశం దక్కని బౌలర్లు. వీరిలో కనీసం ఇద్దరికైనా నాలుగో మ్యాచ్ తుది జట్టులో స్థానం లభించవచ్చని సమాచారం. గత ఏడాది కాలంగా విపరీతంగా క్రికెట్ ఆడుతున్న మొహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతని స్థానంలో సైనీని ఎంచుకోవచ్చు. యుజువేంద్ర చహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు బదులుగా సుందర్లను ఎంచుకోవచ్చు.
ఓపెనర్గా విలియమ్సన్:
మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్కు సిరీస్ సమర్పించుకున్న కివీస్ మార్పులు చేయనుంది. వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారిన ఆల్రౌండర్ గ్రాండ్హోమ్ బదులుగా డారిల్ మిచెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఫామ్లో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చే అవకాశముంది. పరిస్థితులను బట్టి గప్టిల్తో కలిసి విలియమ్సన్ ఓపెనర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఓపెనర్ కొలిన్ మన్రో వన్డౌన్లో వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. సౌతీ అనుభవం పనిచేయట్లేదు. సిరీస్లో విఫలమైన సాంట్నర్ తనకు అచ్చొచ్చిన మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
పిచ్, వాతావరణం:
వెస్ట్పాక్ స్టేడియంలోని పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణంతో సమస్య లేదు. 2014 నుంచి ఇక్కడ ఆడిన వరుస ఆరు మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మైదానంలో జరిగిన 11 మ్యాచ్ల్లో ఒక్కసారి మాత్రమే స్కోరు 200 దాటింది. చివరి ఐదు టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 178. ఇందులో ఒక్కసారి మాత్రమే చేజింగ్ టీమ్ నెగ్గింది.
జట్ల అంచనా:
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పాండే, దూబే, జడేజా/సుందర్, శార్దుల్, చాహల్/కుల్దీప్, షమీ/సైనీ, బుమ్రా.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, మిచెల్, సిఫెర్ట్, సాంట్నర్, కుగెల్జిన్, సౌథీ, సోధీ, బెన్నెట్.