తిరుగులేని వరుస విజయాలతో..
ఆడిన అయిదు మ్యాచ్లల్లో ఏ ఒక్కదాన్నీ కోల్పోలేదు బ్లాక్ క్యాప్స్. వర్షం వల్ల టీమిండియాతో ఆడాల్సిన మ్యాచ్ను పక్కన పెడితే.. ఒక్కదాంట్లో కూడా ఓటమి చవి చూడలేదు. దక్షిణాఫ్రికా మినహా మిగిలిన ఓ మోస్తరు స్థాయి జట్లపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. చావో, రేవో తేలాల్సిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాను సైతం ఖంగు తినిపించింది. విజేతగా నిలిచింది. ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుందని అందరూ ఆశించారు. వారి అంచనాలను తలకిందులు చేసింది.
దక్షిణాఫ్రికా పైనా సంయమనం కోల్పోని విజయం..
వరుస వికెట్లను కోల్పోతూ ఓటమి అంచుల్లో నిలిచిన జట్టును కేప్టెన్ కేన్ విలియమ్స్న్ విజయ తీరాలకు చేర్చిన తీరు అద్భుతం. కుదురుగా బ్యాటింగ్ చేసిన కేన్ విలియమ్సన్ 138 బంతుల్లో 106 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు. గత ప్రపంచకప్ టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఈ సారి అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది కివీస్. నిలకడగా రాణిస్తోంది. ప్రత్యర్థి జట్టు ఎంతటి బలవంతమైన్పటికీ.. పక్కా వ్యూహాలతో బోల్తా కొట్టిస్తోంది. నిజానికి- ఫీల్డింగ్ న్యూజీలాండ్ జట్టు ప్రధాన బలం. పక్కా ప్లానింగ్ ప్రకారం ఫీల్డర్లను మోహరింపజేస్తాడు కేన్ విలియమ్సన్. దానికి అనుగుణంగానే బౌలర్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. బంతి గాల్లోకి లేస్తే.. ఫీల్డర్ చేతుల్లో పడేలా ఫీల్డింగ్ ఏర్పాటు ఉంటుంది కివీస్ది.
పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల భయం లేదిక..
2015 ప్రపంచకప్ ఫైనలిస్ట్గా నిలిచిన న్యూజీలాండ్కు ఈ సారి రెండు ప్రధాన జట్ల నుంచి పోటీ తప్పింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల భయం లేదనే చెప్పుకోవచ్చు. ఈ రెండు జట్లు సెమీ ఫైనల్కు రావడం దాదాపు అసాధ్యమని తేలింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ రెండూ సెమీస్కు రాలేవు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల గండాన్ని దాటుకోగలిగితే ప్రపంచకప్ న్యూజీలాండ్ సొంతం అవుతుంది. ప్రపంచకప్ను ఎగరేసుకుని వెళ్లడానికి 1992, 2015 నాటి సానుకూల పరిస్థితులు ఇప్పుడూ సృష్టించుకుంది కివీస్. 1992 పాకిస్తాన్, 2015లో ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయం పాలైంది.
పాక్ ఆటతీరు అప్పట్లా లేదు..
ఇందులో పాకిస్తాన్ అడ్డంకి దాదాపు ఇక ఎదురు పడనట్టే. నిలకడలేమికి మారుపేరుగా నిలిచిన ఆస్ట్రేలియా.. జట్టు ఆటతీరు ఎలా ఉంటుందో ఓ అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. నిలకడ లేమి ఆస్ట్రేలియాను వెంటాడుతున్న నేపథ్యంలో.. ఆ జట్టును అలవోకగా ఎదుర్కొనడానికి అవకాశాలు ఉన్నాయి న్యూజీలాండ్కు. 1992లో ఇంజమామ్ ఉల్ హక్ రూపంలో గండం ఎదురు పడగా దాన్ని బయట పడలేక, పరాజయం పాలైంది కివీస్. 1999లోనూ పాకిస్తాన్ జట్టే న్యూజీలాండ్కు అడ్డుగా నిలిచింది. 2007, 2011 ప్రపంచకప్లల్లో శ్రీలంక.. న్యూజీలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది.
వైభవాన్ని కోల్పోయిన లంకేయులు..
2007లో మహేల జయవర్ధనే, 2011లో కుమార సంగక్కార సెంచరీలు సాధించి మరీ.. కివీస్ జైత్రయాత్రను అడ్డుకున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ అడ్డు దాదాపు తొలగిపోయింది. ఎదురొచ్చినప్పటికీ.. సునాయసంగానే అధిగమించగలదు. ఎందుకంటే- సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎంత నాసిరకంగా తన ప్రదర్శనను కొనసాగిస్తున్నదో చూస్తున్నాం. శ్రీలంక పరిస్థితీ అంతే. 2011 ప్రపంచకప్ తరువాత కుమార సంగక్కార, మహేల జయవర్ధనే రిటైర్ అయ్యారు. అప్పటి నుంచీ పతనావస్థకు చేరుకుంది లంకేయుల జట్టు. ఈ రెండింటి అడ్డు ఇక లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన జట్లుగా పేరున్న భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గండాలను అధిగమిస్తే.. ఈ సారి ప్రపంచకప్ బ్లాక్ క్యాప్స్ సొంతం అవుతుందనడంలో సందేహాలు అనవసరం.