టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
బుధవారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ 118 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా వంటి టాప్ జట్లను వెనక్కినెట్టి కివీస్ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం న్యూజిలాండ్ (118) మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (116), భారత్ (114) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ (106) మరియు దక్షిణాఫ్రికా (96) టాప్-5లో ఉన్నాయి. పాకిస్థాన్ 82 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది. డేనియల్ వెట్టోరి, స్టీఫెన్ ఫ్లెమింగ్, రాస్ టేలర్, బ్రెండన్ మెక్కల్లమ్ లాంటి సారథులకు సాధ్యం కానీ రికార్డు కేన్ విలియమ్సన్ అందుకున్నాడు.
11 వికెట్లు తీసిన జేమీసన్
రెండో ఇన్నింగ్స్లో కివీస్ పేస్ బౌలర్ కైల్ జేమీసన్ ఆరు వికెట్లు తీసి పాకిస్తాన్ జట్టును కోలుకోని దెబ్బకొట్టాడు. ట్రెంట్ బోల్ట్ కూడా మూడు వికెట్లతో చెలరేగడంతో పాక్ 186 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం మూటగట్టుకుంది. అజహర్ అలీ (37), జాఫర్ గౌహర్ (37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇక ఈ మ్యాచ్లో జెమీసన్ మొత్తంగా 11 వికెట్లు తీసి సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులకే పాక్ ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. జెమీసన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. సౌథీ, బోల్ట్ తలో రెండు వికెట్లు తీశారు.
నంబర్ వన్ బ్యాట్స్మన్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొమ్మిది గంటల పాటు క్రీజులో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ చేశాడు. విలియమ్సన్ తన కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ అందుకున్నాడు. అంతేకాదు టెస్టుల్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ కూడా. డబుల్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్ మామకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా దక్కింది.
|
పాయింట్ల పట్టికలో మూడోస్థానం
పాకిస్తాన్పై ఇన్నింగ్స్ మీద 176 పరుగుల తేడాతో జట్టు గెలుపొందడం ద్వారా అగ్రస్థానానికి చేరుకోవడంతో ఈ సిరీస్ కేన్ విలియమ్సన్కు మరింత ప్రత్యేకంగా మారింది. తాజా విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 420 పాయింట్లతో ప్రస్తుతం మూడోస్థానంలో నిలిచింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఒక్కో మ్యాచ్ ఓడిపోవడం కూడా కేన్ సేనకు కలిసొచ్చింది.
'శార్దూల్, నటరాజన్ గాయపడ్డ వారి స్థానాల్లో వచ్చారు.. మూడో పేసర్గా సైనీకే తొలి ప్రాధాన్యం'