దుబాయ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ యాక్షన్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం క్లీన్ చీట్ ఇచ్చింది. విలియమ్సన్ బౌలింగ్ యాక్షన్పై విచారణ చేపట్టిన ఐసీసీ.. అతని బౌలింగ్లో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. విలియమ్సన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడే ఉందని పేర్కొంది. ఐసీసీ తాజా ప్రకటనతో ఇకపై విలియమ్సన్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ను యధావిధిగా కొనసాగించొచ్చు.
భవిష్యత్తులో ఢిల్లీ షెడ్యూల్పై ఆలోచిస్తాం: కాలుష్యం దెబ్బకు గంగూలీ వెనక్కి తగ్గినట్టేనా?
గాలేలో ఆగస్టు 14 నుంచి 18 వరకు శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ బౌలింగ్ చేసాడు. ఆ సమయంలో అతని యాక్షన్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫీల్డ్ అంపైర్లు అందించిన నివేదిక ఆధారంగా మ్యాచ్ రిఫరీ ఈ విషయాన్ని ఐసీసీకి తెలిపాడు. దాంతో అతని యాక్షన్పై ఐసీసీ విచారణ చేపట్టింది. ఇక అక్టోబర్ 11 న లాఫ్బరోలో విలియమ్సన్ బౌలింగ్ పరీక్షకకు హాజరయ్యాడు.
ఐసీసీ విభాగం విలియమ్సన్ బౌలింగ్ను క్షణ్ణంగా పరిశీలించి అతనికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. విలియమ్సన్ తన మోచేతిని 15 డిగ్రీలోపే వంచుతున్నాడని ఐసీసీ స్పష్టం చేసింది. దాంతో విలియమ్సన్కు ఊరట లభించింది. ఇకపై విలియమ్సన్ తన ఆఫ్ స్పిన్ను యథావిధిగా కొనసాగించవచ్చు.
అంతకుముందు జూలై 2014లో అంతర్జాతీయ క్రికెట్ బౌలింగ్ నుండి విలియమ్సన్ సస్పెండ్ చేయబడ్డాడు. పునపరిశీలన తరువాత 2014 డిసెంబర్లో తిరిగి బౌలింగ్ చేయడానికి అతనికి అనుమతి లభించింది. గాలే టెస్టులో విలియమ్సన్తో పాటు శ్రీలంక స్పిన్నర్ అకిలా ధనుంజయపై కూడా అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్పై ఐసీసీకి ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. టేలర్ 44 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే ఇంగ్లండ్ ఛేదించింది. విన్స్ 38 బంతుల్లో 59 పరుగులు చేశాడు. బెయిర్స్టో 35, మోర్గాన్ 34 పరుగులతో రాణించారు. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్లు తలపడిన తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఇదే.