జూన్ చివర్లో ఐర్లాండ్లో జరిగే 2 మ్యాచ్ల టీ20 సిరీస్కు వీవీఎస్ లక్ష్మణ్తో పాటు సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి టీమిండియా జట్టుతో పాటు ఉండనున్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్లుగా వ్యవహరిస్తున్న వీరు.. ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా అతని మార్గదర్శకత్వంలో టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. అదే సమయంలో ఇంగ్లాండ్తో ఏకైక టెస్టు కోసం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టెస్టు జట్టుతో ఉండనున్నాడు. ఇంగ్లాండ్లో జరిగిన అసంపూర్ణ టెస్టు సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక 5వ టెస్ట్ కోసం ఇంగ్లాండ్, ఇండియా సీనియర్లతో కూడిన జట్లతో బరిలో దిగాల్సిన అవసరముంటుంది. ఇక అదే టైంలో టీమిండియా జూన్ 26, 28తేదీల్లో 2 టీ20లు ఐర్లాండ్తో ఆడాల్సి ఉంది. దీంతో ఎన్సీఏ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ను ఐర్లాండ్ టూర్ కోసం బీసీసీఐ ప్రధాన కోచ్గా ఎంపిక చేసింది.
జూన్ 24 నుండి 27 వరకు లీసెస్టర్షైర్తో టీమిండియా టెస్ట్ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉంటూ తొలి టెస్టుకు సన్నాహాలు చూసుకుంటాడు. ఇక ఇంతకుముందు ఇండియా Aజట్టుకు కోచ్గా పనిచేసిన కోటక్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో కరీబియన్లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా జట్టు కోచింగ్ స్టాఫ్లో పనిచేసిన బాలి ఫీల్డింగ్ కోచ్గా, బహుతులే బౌలింగ్ కోచ్గా వ్యవహరించనున్నారు. ఈ ముగ్గురు ఎన్సీఏ కోచ్లు ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ జట్టులో సపోర్టింగ్ స్టాఫ్లో చేరారు.
ఐర్లాండ్తో టీ20ఐ సిరీస్కు బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఐర్లాండ్పై భారత్ ప్రధానంగా టీ20లో రాణించే ప్లేయర్లనే ఎంపిక చేయనుంది. ఇక జులై 7నుంచి ఇంగ్లాండ్తో మూడు టీ20లు, ఆ తర్వాత 5 వన్డే సిరీస్లు ఉన్న నేపథ్యంలో ఐర్లాండ్ పర్యటనను ముందస్తు సన్నాహాక సిరీస్గా టీమిండియా భావించనుంది. 'ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఇండియాలో ఉన్న సీనియర్ సహాయక సిబ్బంది ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరిన తర్వాత.. వారి స్తానంలో బాలి, బహుతులే, కోటక్ చేరుతారు. దక్షిణాఫ్రికాతో రాజ్కోట్, బెంగళూరులో జరిగే మిగిలిన టీ20 మ్యాచ్లలో వారు తమతమ బాధ్యతలు స్వీకరిస్తారు.' అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.