
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పాకిస్థాన్ వెళ్లారు. తన స్నేహితుడు ఇమ్రాన్ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సిద్ధూ ప్రత్యేక ఆహ్వానితునిగా పాకిస్థాన్కు వెళ్లారు. బ్లూ సూట్, పింక్ టైతో వాఘా బోర్డర్ ద్వారా సిద్దూ లాహోర్లో అడుగుపెట్టారు.
లాహోర్ నుంచి శనివారం ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం జరగనున్న ఇస్లామాబాద్కు వెళ్లనున్నారు. భారత దూతగా ఓ ప్రేమ సందేశంతో తాను పాకిస్థాన్ వచ్చినట్లు సిద్ధూ అన్నారు. ఈ సందర్భంగా సిద్దూ మాట్లాడతూ "నేను ఇక్కడికి ఓ రాజకీయ నేతగా రాలేదు. కేవలం ఓ స్నేహితుడిగా వచ్చాను. నా స్నేహితుడి సంతోషంలో పాలుపంచుకోవడానికి వచ్చాను" అని అన్నారు.
క్రీడాకారులు, కళాకారులు రెండు దేశాలను దగ్గరికి తీసుకురావడంలో సాయపడ్డారని అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి మాటలను ఈ సందర్భంగా సిద్ధూ గుర్తుచేశారు. "మన పొరుగింట్లో మంట పుడితే ఆ వేడి మనకు తగులుతుంది" అని వాజ్పేయి అన్న మాటలను సిద్ధూ చెప్పారు.
బలహీనతలను బలంగా మార్చుకునే సామర్థ్యం ఇమ్రాన్ఖాన్కు ఉందని, ఆయనను పాకిస్థాన్ సామరస్యానికి ప్రతీకగా చూస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ఖాన్కు బహుమతిగా ఇవ్వడానికి తాను ఓ కశ్మీరీ షాల్ను తీసుకొచ్చినట్లు తెలిపారు.